మంచిర్యాల అర్బన్ : ప్రభుత్వ అక్రమాలపై నిలదీసిన ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడమే అధికార కాంగ్రెస్( Congress ) లక్ష్యమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ( MLA Kovalakshmi ) ఆరోపించారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల ఘటనకు సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలసి కోర్టుకు హాజరైన అనంతరం ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో మెజారిటీ లేకపోయినా అధికార పార్టీ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించి చైర్మన్ ఎన్నికను ప్రభావితం చేసిందని ఆరోపించారు. ఆ సమయంలో పోలీసు శాఖ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని, తమ పార్టీ కౌన్సిలర్లను స్వేచ్ఛగా వ్యవహరించనివ్వలేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో అభివృద్ధి కనిపించలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు తప్పు చేయకపోయినా రాజకీయ కక్షతో కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ వేధింపులను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వారికి తగిన సమాధానం ఇస్తారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ మాజీ వైస్ జడ్పీ చైర్సన్ మూల రాజీరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాజరమేష్, టీబీజీకేఎస్ నాయకులు మెడిపెల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.