చండూరు, ఆగస్టు 07 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలే ప్రశ్నించి తిప్పికొట్టాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుండి 12 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా చైతన్య బైక్ యాత్రను శుక్రవారం చండూరు మండలం బంగరుగడ్డ గ్రామంలోని తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మబిక్షం విగ్రహం వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో కేంద్రం వివక్ష చూపుతూ ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. ప్రజలకు ఈ విషయాలపై అవగాహన కల్పించి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడమే సీపీఐ చేపట్టిన ప్రజా చైతన్య జీప్ యాత్రల ప్రధాన లక్ష్యమని వివరించారు.
నల్లగొండ జిల్లాకు జీవనాడిగా భావిస్తున్న ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు దశాబ్దాలుగా పెండింగ్లో ఉండడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితేనే జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సీజన్లో జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయని, బోరు బావులపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న వరి పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్టం పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నల్పరాజు రామలింగయ్య, చండూరు మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్, మండల సహాయ కార్యదర్శులు పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, పార్టీ మండల కార్యవర్గ సభ్యులు తిప్పర్తి రాములు, బరిగెల వెంకటేష్ దోటి వెంకన్న, బండమీది వెంకన్న, సిహెచ్ ఉషయ్య, గంటా రమేష్, జెల్లా శ్రీను, ఇరిగి సంజీవ, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు జగన్, పాండురంగారావు, మాజీ జడ్పీటీసీ మాదగోని విజయలక్ష్మి, బోయపల్లి జంగయ్య బోయపల్లి భిక్షమయ్య పాల్గొన్నారు.