– వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇవ్వాలి
– తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దండా వెంకటరెడ్డి డిమాండ్
– సూర్యాపేట- దంతాలపల్లి రహదారిపై రైతులతో కలిసి రాస్తారోకో
ఆత్మకూర్ (ఎస్), సెప్టెంబర్ 19 : వర్షాభావ పరిస్థితులతో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దండా వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆత్మకూరు (ఎస్) మండల కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇవ్వాలని, ఆత్మకూర్ (ఎస్ )మండలాన్ని తరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట- దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్న రైతులకైనా నిరంతర విద్యుత్ అందించి పంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ కోతలు విధించడంతో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తె లిపారు.
ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని, కరువు సహాయక చర్యలను వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు. రైతుల పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదన్నారు. తక్షణమే చర్యలు చేపట్టకపోతే రైతాంగాన్ని సమీకరించి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పోరాటం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు అవిరే అప్పయ్య, దండ శ్రీనివాస్ రెడ్డి, గుండు చిన్న లింగయ్య, సోమిరెడ్డి దామోదర్ రెడ్డి, యాతాకుల వెంకన్న, మూల విజయ్ రెడ్డి, రేణిగుంట్ల రవి, రాచకొండ సైదులు, నూకల గిరి, యాతాకుల మల్లయ్య పాల్గొన్నారు.