– నిత్యం ఖమ్మం బాట పడుతున్న ప్రజానీకం
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 19 : గ్రామం నుండి పెద్ద గ్రామ పంచాయతీ, పెద్ద గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా స్థానికుల కూరగాయల సమస్య దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉంది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీ పరిధిలో సుమారుగా లక్ష మంది జనాభా ఉంది. వీరిలో మెజారిటీగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు దినసరి కార్మికులు ఎక్కువ మొత్తంలో ఉన్నారు. ఉదయం 9 గంటలు దాటిందంటే ప్రతి ఇంటి నుండి వారి పనుల నిమిత్తం కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో తెల్లవారింది మొదలు ప్రతి ఇంట్లో ఒకటే ప్రధాన సమస్య కూరగాయలు. ఏదో అలా బజారుకు వెళ్లి కూరగాయలు తీసుకొని రావలసిన పరిస్థితి లేదు. అక్కడక్కడ కొద్దిమంది డబ్బా కోట్లు, ఇతర కిరాణా షాప్ ల వద్ద మాత్రమే నిల్వ ఉన్న కూరగాయలు అందుబాటులో ఉంటాయి. తాజా కూరగాయలు, ఇష్టమైన కూరగాయలు కావాలంటే మాత్రం ఈ మున్సిపాలిటీలో కుదరని ముచ్చట.
గత కొద్ది రోజుల క్రితం ప్రధాన రహదారుల వెంబడి చిరు వ్యాపారులు అక్కడక్కడ కూరగాయల అమ్ముకుంటూ కనబడుతుండేవారు. ఇటీవల రోడ్ల విస్తరణ పనులు వేగవంతం కావడంతో చిరు వ్యాపారులు సైతం అందుబాటులో లేకుండా పోయారు. దీంతో కేజీ కూరగాయలు కావాలన్నా ఖమ్మం నగరం వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రూ.30 కూరగాయల కోసం రూ.50 పెట్రోలు పోస్తే తప్ప పోయిరాని పరిస్థితి దాపురించింది. మున్సిపాలిటీ పరిధిలో రైతు బజార్ ఏర్పాటుకు కొంత ప్రభుత్వ భూములు ఉన్నందున తక్షణం రైతు బజార్లు ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా మున్సిపల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. హోల్సేల్ నుండి రిటైల్, అక్కడి నుండి చిరు వ్యాపారుల చేతికి వచ్చేసరికి కూరగాయల ధరల భారం ప్రజలపై మరింత పడుతుంది. కనీస వసతుల్లో ఒకటైన రైతు బజార్లు ఇప్పటికైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ దిశగా మున్సిపల్ అధికారులు, ప్రతినిధులు ఆలోచన చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.