బూర్గంపహాడ్, సెప్టెంబర్ 19 : ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డు కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సమావేశం సారపాకలో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ఐఎన్టీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి హాజరయ్యారు. గత నెలలో కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షుడు వూర్లగొండ వీరన్న ఉద్యోగ విరమణ చెందడంతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా పూనెం సురేంద్ర, ప్రధాన కార్యదర్శి పాటి సోమిరెడ్డి, కోశాధికారిగా గల్లా ఉమామహేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, కార్యాలయ కార్యదర్శులు ఇలా 61 మందితో కాంట్రాక్టు వర్కర్ల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో యూనియన్ స్థితిగతులు, భవిష్యత్ కార్యాచరణ, పెండింగ్ సమస్యలపై చర్చించారు. నూతన కమిటీని వక్తలు సత్కరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఐటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్, యూనిట్ హెచ్ఆర్ హెడ్కు అందజేశారు. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సభ్యులు, ప్లాంటేషన్ మహిళలు పాల్గొన్నారు.