దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. నాడు కూలీలుగా పనిచేసినవారు నేడు యజమానులుగా మారి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లపై నిపుణులతో శిక్షణ సైతం ఇప్పించి తోడ్పాటునందిస్తున్నది. ఇందులో భాగంగా కొడంగల్ మండలం చిల్ముమైలారం గ్రామానికి చెందిన మైలారం దస్తులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో రేడియో గ్రాఫర్గా పని చేస్తూ చాలీచాలని జీతంతో కాలం వెల్లదీసేవాడు. కరోనాతో ఉపాధి కోల్పోయి దిక్కుతోచని పరిస్థితితో ఉన్న దస్తులు.. దళితబంధు మొదటి విడుతలో లబ్ధిదారుడిగా ఎంపికయ్యాడు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన రూ.10 లక్షలతో కొడంగల్ పట్టణంలో ఎక్స్రే కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఏడాదిగా ఉపాధి పొందుతున్నాడు. ఖర్చులు మినహా నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదిస్తూ, తల్లిదండ్రుల బాగోగులను చూసుకుంటున్నాడు. ‘దళితబంధు’తో కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని దస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు.
– వికారాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : దళిత బంధు పథకం అమలుతో జిల్లాలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. మొన్నటి వరకు కూలీ పని చేసి జీవనోపాధి పొందినవారు.. దళిత బంధు పథకంలో భాగంగా రూ.10 లక్షలు విలువ చేసే యూనిట్లు సొంతం కావడంతోపాటు దండిగా ఉపాధి పొందుతున్నారు. దళిత బంధు పథకంతో గతంలో కారు డ్రైవర్లుగా పనిచేసినవారు..నేడు ఓనర్లు, గతంలో రోజువారీ కూలీలు.. నేడు యజమానులయ్యారు. కొవిడ్ మహమ్మారితో ఉపాధి కోల్పోయిన ఓ పేదింటి యువకుడికి దళిత బంధు పథకం అండగా నిలిచింది. గతంలో తల్లిదండ్రులకు దూరంగా ఉండి చాలీచాలని జీతంతో గడిపిన ఆ యువకుడికి చేతినిండా పనితోపాటు ఆర్థికంగా వృద్ధి చెందాడు.
రెండేండ్లపాటు ఏ ఉపాధి లేక మళ్లీ పట్నంలో ఏ ప్రైవేట్ ఆసుపత్రి చూసుకోవాలో అని చూస్తున్న సమయంలో దళిత బంధు పథకం కొడంగల్ మండలం చిల్ముమైలారం గ్రామానికి చెందిన మైలారం దస్తులుకు దళిత బంధువయ్యింది. దళిత బంధు పథకంలో భాగంగా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి తన బాధలు విన్నవించుకోవడంతో లబ్ధిదారుడిగా ఎంపిక చేసిండ్రు. దళిత బంధు పథకంలో భాగంగా కొడంగల్లో ఎక్స్రే కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నాడు. గతంలో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలా తక్కువ జీతంతో పనిచేసిన దస్తులు గతేడాదిగా ఎక్స్రే కేంద్రాన్ని నిర్వహిస్తూ ఆర్థికంగా బలోపేతమయ్యాడు. ఖర్చులుపోనూ నెలకు రూ.30-40 వేల వరకు సంపాదిస్తూ, ఊరికి దగ్గరుంటూ కుటుంబ బాగోగులు చూసుకుంటున్నాడు. పేద రైతు కుటుంబానికి చెందిన మాలాంటి పేదలకు రూ.10 లక్షలతో వ్యాపారం పెట్టించి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామంటున్నాడు దస్తులు.
దళితుల జీవితాల్లో వెలుగులు
దళిత బంధు పథకం అమలుతో జిల్లాలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. దళిత బంధు పథకంలో భాగంగా జిల్లాలోని లబ్ధిదారులు మినీ డెయిరీ, పౌల్ట్రీపామ్లతోపాటు కార్లు, ట్రాక్టర్ యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. లబ్ధిదారులకు ఆయా రంగాల్లోని నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ కూడా ఇప్పించారు. దళిత బంధు లబ్ధిదారులు వారు ఎంచుకున్న వ్యాపారాల్లో ఏ విధంగానైనా నష్టపోయినట్లయితే వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రక్షణ నిధి కింద ఇప్పటివరకు రూ.35.80 లక్షల నిధులను సంబంధిత అధికారులు జమ చేశారు.
మరోవైపు మొదటి విడతలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, జిల్లాకు రూ.35.80 కోట్ల నిధులను విడుదల చేయగా, 358 యూనిట్లకు సంబంధించి జిల్లా యంత్రాంగం గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. జిల్లాలో మొదటి విడతలో మంజూరైన యూనిట్లలో వికారాబాద్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు, తాండూరు నియోజకవర్గంలో 100, పరిగి నియోజకవర్గంలో 80, కొడంగల్ నియోజకవర్గంలో 60, చేవెళ్ల నియోజకవర్గంలో 18 యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. మరోవైపు రెండో విడుతకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గానికి 500 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయగా, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతున్నది.
దళితబంధుతో స్వయం ఉపాధి : మైలారం దస్తులు, లబ్ధిదారుడు, చిలుము మైలారం, కొడంగల్ మండలం
నా పేరు మైలారం దస్తులు. నేను ఇంటర్ తర్వాత రూ.50 వేలు పెట్టి హైదరాబాద్లో రేడియోగ్రాఫర్గా శిక్షణ తీసుకున్నాను. అనంతరం ఐదేండ్లపాటు ఉప్పల్లోని సుచిత్ర ఆసుపత్రి, మరో రెండున్నరేండ్లు కూకట్పల్లిలోని ఓమ్నీ ఆసుపత్రిలో రేడియోగ్రాఫర్గా పనిచేశాను. నెలకు రూ.20 వేల వరకు జీతం వచ్చేది అయితే రూమ్ రెంట్, ఖర్చులు పోనూ ఏమీ మిగిలేది కాదు. కుటుంబానికి దూరంగా ఉండి, పండుగలకు మాత్రమే వచ్చిపోయేవాడిని. దళితుల కుటుంబాల్లో సుస్థిర జీవనోపాధి, ఆర్థిక వృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన దళిత బంధు పథకంతో మా కుటుంబంలో వెలుగులు నిండాయి. గతేడాదిగా కొడంగల్లో ఎక్స్రే కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాను. దళిత బంధులాంటి పథకం అమల్లోకి వస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదని, దేశంలో ఎక్కడాలేని విధంగా సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.