కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గత నాలుగేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువచ్చారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఆదానీలాంటి పెట్టుబడిదారులకు అప్పగించేలా చూస్తున్న మోదీ ప్రభుత్వం.. కరువును అధిగమించడమే లక్ష్యంగా గత కొన్నేండ్లుగా నిరుపేదల కడుపు నింపేందుకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకానికి మాత్రం తూట్లు పొడుస్తున్నారు. గత నాలుగేండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానాలతో ఉపాధి హామీ పనులనే నమ్ముకొని బతుకుతున్న కూలీలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. ఉపాధి హామీ పనులను భారీగా తగ్గించిన కేంద్రం వేల కుటుంబాల కడుపు కొడుతున్నది. కేంద్రం అమల్లోకి తీసుకువచ్చి ఎన్నో కుటుంబాలకు ఉపాధిని దూరం చేసిన కొత్త నిబంధనలపై జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలందరూ మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2,00,372 ఉపాధి హామీ కుటుంబాలుండగా.. 4,38,398 మంది కూలీలున్నారు.
– వికారాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ)
పేదలకు ఉపాధి హామీ పనులను దూరం చేసే విధంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. లక్షల మంది పేద కుటుంబాల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే తప్పుడు నివేదికలు తెప్పించుకొని అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రచారం చేసి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే గత నాలుగేండ్లుగా ఉపాధి హామీ పనిదినాలను భారీగా తగ్గిస్తున్నారు. కేవలం నాలుగేండ్లలోనే 39 లక్షల పనిదినాలను జిల్లాలో తగ్గించారంటే ఉపాధి హామీ పథకంపై మోదీ ప్రభుత్వం ఏ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోటీ 3 లక్షల పనిదినాలను కల్పించగా.. 2022-23లో 31.41 లక్షల పనిదినాలను తగ్గిస్తూ 71.58 లక్షల పనిదినాలను కల్పించాలని నిర్ణయించారు. 2023-24లో మరో 10 లక్షల మేర పనిదినాలను తగ్గిస్తూ 62 లక్షల పనిదినాలను తగ్గించగా, 2024-25కు సంబంధించి మరో 2.98 లక్షల పనిదినాలను తగ్గిస్తూ 59.85 లక్షల పనిదినాలుగా నిర్ణయించారు. 2025-26లో కేవలం 1.80 లక్షల పనిదినాలను పెంచుతూ 61 లక్షల పనిదినాలను కల్పించాలని ఉపాధి హామీ ప్లాన్ను సిద్ధం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఎన్ఆర్ఈజీఎ సాఫ్ట్-ఎన్ఐసీ సాఫ్ట్వేర్తో జిల్లాలోని లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. కొత్త సాఫ్ట్వేర్ విధానంతో కూలీలు తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం పనులకు తప్పనిసరిగా హాజరుకావాలని షరతులను విధించింది. కూలీలు చేస్తున్న పనులకు సంబంధించి ఉదయం 11 గంటలలోపు ఒక ఫొటో, సాయంత్రం 2 గంటల తర్వాత రెండో ఫొటో తప్పనిసరిగా తీయడంతోపాటు అప్లోడ్ చేస్తున్నారు. ఒక గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి ఒక పని పూర్తైన తర్వాతనే మరొక పని చేపట్టాలని నిబంధన విధించారు. దీంతో గతంలో మాదిరిగా కాకుండా పనులు చాలా ఆలస్యమవుతున్నాయి. ప్రతిరోజూ చేపడుతున్న పనులను వెంటనే యాప్లో పొందుపర్చాలనే నిబంధనలతో క్షేత్రస్థాయిలో సిగ్నల్ లేకపోవడంతో అప్లోడ్ చేయడం ఇబ్బందిగా మారి పనులు కూడా ఆలస్యంగా జరుగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఈ ఆర్థిక సంవత్సరం వేల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు గడువు సమీపిస్తున్నా కనీసం 4 వేల కుటుంబాలకు కూడా 100 రోజుల పనిని కూడా కల్పించలేకపోయారు. మూడేండ్ల క్రితం 19,998 కుటుంబాలకు వంద రోజులపాటు పనులను కల్పించగా, గత ఆర్థిక సంవత్సరం కేవలం 1000 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనులను కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు 3401 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనిని కల్పించారు.