న్యూస్ నెట్వర్క్, డిసెంబర్ 13 : విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు ప్రభుత్వం పదో తరగతి సాంఘిక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఎన్నికల సమయంలోనే పాఠ్యాంశం సిలబస్లో ఉండడం విశేషం. ఇందులో ఎన్నికల వ్యవస్థ నుంచి ఓటు హక్కు వినియోగం వరకు విద్యార్థులు సులభతరంగా అర్థం చేసుకునేలా పాఠ్యాంశంలో రూపొందించారు.
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల అవసరాన్ని గుర్తించి 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడిందని, ఇది స్వయం ప్రతిపత్తి సంస్థ అని వివరించారు. 1952లో నిర్వహించిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో 17.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 67 కోట్లు దాటిందని, ఎన్నికల నిర్వహణకు సివిల్ సర్వీస్లకు చెందినవారు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉంటారని పాఠ్యాంశంలో పేర్కొన్నారు. దీంతోపాటు ఎన్నికల సంఘం దేశంలో సుమారు 45 లక్షల మంది సిబ్బందితో భారీ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నదని పొందుపర్చారు.
ఎన్నికల నిర్వహణలో ఈసీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. గతంలో భారత ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేసిన టీఎస్ శేషన్ ప్రజల అభిమానాన్ని చూరగొన్న తీరును వివరించారు. రాజ్యాంగంలోని 15 భాగంలోని ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎన్నికల సంఘం నిర్మాణం, విధులను వివరించారు. ఓటర్ల జాబితాను రూపొందించడం మొదలు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ తేదీల ఖరారు, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు పాటించాల్సిన నియమావళిని పొందుపర్చారు.
అభ్యర్థుల ప్రవర్తన నియమావళికి సంబంధించి 11 అంశాలను ఇందులో పొందుపర్చారు. రాజకీయ పార్టీ ఏ విధంగా గుర్తింపు పొందుతున్నది. ఇందుకోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే అంశాలను వివరించారు. ఎన్నికల సంఘం గుర్తులను ఎలా కేటాయిస్తోంది. ఓట్ల శాతం ఆధారంగా ఒక పార్టీని జాతీయ, ప్రాంతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారో వివరించారు. పార్టీల ప్రచార సమయం, నిబంధనలు ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలను పాఠ్యాంశంలో పొందుపర్చారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ రోజున అధికారులు, ఏజెంట్ల విధులను వివరించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేయాలి. రాజకీయ పార్టీలు, ఓటర్లు ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి సహకరించడం, పోలింగ్ రోజున ఏ అధికారి ఏ విధులు నిర్వర్తిస్తారో తెలియజేశారు.
పదో తరగతి సాంఘిక శాస్త్రంలో ఎన్నిక ల ప్రక్రియపై పాఠ్యాంశాన్ని ముద్రించ డం అభినందనీయం. విద్యార్థి దశ నుం చే ఎన్నికలపై అవగాహన కల్పించడం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎన్నికల క్రమంలో ఈ పాఠం బోధిస్తే విద్యార్థు లు ఆసక్తిగా విన్నారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ రోజున అధికారులు, ఏజెంట్ల విధులను పొందుపర్చారు. పోలింగ్ రోజు ఏ అధికారి ఏ విధులు నిర్వర్తిస్తారో తెలిపారు.
– అంగ శ్రీనివాస్, ఉపాధ్యాయుడు, జడ్పీఎస్ఎస్
న్నికల గురించి మా పదో తరగతి పాఠ్యపుస్తకంలో పొందుపర్చిన అంశాలను మా తల్లిండ్రులతోపాటు 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు చెప్పాను. ఎన్నికల ప్రక్రియ రెండు విధాలుగా ఉంటుందని.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ ఈవీఎంలతో చేస్తారని, లోకల్ ఎన్నికల సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్తో వేస్తామని చెప్పా.
– దొండే సంతోషి, విద్యార్థిని, పదో తరగతి