వికారాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటరు తుది జాబితాను విడుదల చేసింది. అలాగే ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెక్ (ఎఫ్ఎల్సీ) ప్రక్రియ కూడా అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో పూర్తైంది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి రానుండగా, కొడంగల్ నియోజకవర్గం మాత్రం మహబూబ్నగర్ పార్ల మెంట్ పరిధిలోకి వెళ్తుంది.
ఆయా నియోజకవర్గాలకు సరిపడా ఈవీఎంలను సమకూర్చుతున్నారు. అలాగే పోలింగ్ నిర్వహణకు సిబ్బందిని నియమించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవోల వివరాలను ఆన్లైన్లో పొం దుపర్చే ప్రక్రియ కొనసాగుతున్నది. ఎన్నికల షెడ్యూ లు రాగానే వారికి శిక్షణ ఇచ్చేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది.
ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ఈవీఎంలకు సంబంధించి ఏమైనా సాంకేతిక సమస్యలొస్తే వెంటనే వేరే వాటిని ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 1,133 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ అదనంగా సమకూర్చేందుకు ఈవీఎంలు తక్కువ అవుతుండడంతో ఈసీఐఎల్ నుంచి జిల్లాకు కొత్తగా 275 ఈవీఎంలు చేరుకున్నాయి. అలాగే జి ల్లాలో బ్యాలెట్ యూనిట్లు-2267, కంట్రోల్ యూని ట్లు-1694 , వీవీ ప్యాట్లు-1791 ఉన్నాయి. ఈవీఎంలపై నియోజకవర్గ కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్లో ఓటు వేసే విధానంపై ప్రజలు, యువతకు అవగాహన కల్పిస్తున్నారు.
ఓటరు తుది జాబితాను ప్రకటించినా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసేవరకూ మీసేవా లేదా ఆన్లైన్ ద్వారా కొత్త ఓటరుగా అర్హులు నమోదు చేసుకోవచ్చు. అలాగే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ల సంఖ్య పెరిగిన దృష్ట్యా పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండాల్సిన ఓటర్ల సంఖ్య ను 1400 నుంచి 1600లకు పెంచడంతో పోలింగ్ కేంద్రాలను పెంచాల్సిన అవసరం లేకుండా పోయిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుం డా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ మార్చి రెండో వారం లో వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తును మొదలుపెట్టాయి. చేవెళ్ల పార్లమెంట్ నియోజవర్గ పరిధిలో వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ సెగ్మెంట్లున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి మరోసారి బరిలోకి దిగనున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరి న వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. అయితే కోస్గి బహిరంగ సభలో మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి.. తాజాగా చేవెళ్లలో నిర్వహించిన సభలో మా త్రం పట్నం ఫ్యామిలీ నుంచి ప్రకటిస్తారని ఊహించినా అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. సునీతారెడ్డే బరిలోకి దింపుతారా.. లేదంటే ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న కేఎల్ఆర్కు అవకాశం అవుతుం దా అనేది తెలియాల్సి ఉన్నది. మరోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేరును ఆ పార్టీ ఇప్పటికే ఖరారు చేయగా, అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది
ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం జిల్లాలోని వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు నియోజకవర్గాల్లో మొత్తం 9,84,068 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 4,86,109 మంది, మహిళలు 4,97,920 మంది, ఇతరులు 39 మంది ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా పరిగి సెగ్మెంట్లో 2,66,273 మంది ఓటర్లుండగా అందులో పురుషులు 1,33,625 మంది, మహిళలు 1,32,639 మంది, ఇతరులు 9 మంది ఉన్నారు. వికారాబాద్లో మొత్తం 2,31,679 మంది ఓటర్లుండగా.. అందులో పురుషులు 1,15,019 మంది, మహిళలు 1,16,647 మంది, ఇతరులు 13 మం ది ఉన్నారు. తాండూరులో 2,43,849 మంది ఓటర్లుండగా, పురుషులు 1,18,228 మంది, మహిళలు 1,25,614 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 2,42,267 మంది ఓటర్లుండగా, పురుషులు 1,19, 237 మంది, మహిళలు1,23,020 మంది, ఇతరులు 10 మంది ఉన్నారు.