వికారాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. వికారాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న కర్ణాటక రాష్ట్రం సరిహద్దుల వద్ద చెక్పోస్టులు అందుబాటులోకి తీసుకువచ్చి డబ్బు, మద్యం తరలించేవారిపై నిఘా ఉంచారు. అంతేకాకుండా వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు, మండలాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. సీ-విజిల్ యాప్, 1950 టోల్ఫ్రీ నెంబర్ను ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్నారు. ఫ్లయింగ్ స్కాడ్ 6 బృందాలు, 6 ఎస్ఎస్టీ బృందాలు 24 గంటలపాటు పర్యవేక్షణ చేపడుతున్నారు.
ఎన్నికల అధికారులు నియమించిన ఫ్లయింగ్ స్కాడ్లతోపాటు పోలీసులు నిత్యం తనిఖీలు చేస్తున్నారు. నాలుగు నియోజకవర్గాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో 7 అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టులు, 8 అంతర్జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రూ.50 వేల మించి నగదును తరలించినట్లయితే సంబంధిత డబ్బుకు సంబంధించి సరైన ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ నగదును జిల్లా ఎన్నికల అధికారులకు అప్పజెప్పుతారు.
రూ.10 లక్షలకు మించి నగదు పట్టుబడినట్లయితే సంబంధిత నగదును ఐటీ శాఖకు జిల్లా ఎన్నికల అధికారులు అప్పజెప్పనున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.72.20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 551 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. మరోవైపు 2.2 కిలోల గంజాయి, 46 గ్రాముల బంగారం, 2 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 240 లైసెన్సెడ్ గన్లు ఉండగా, ఇప్పటికే 218 మంది డిపాజిట్ చేయడం జరిగింది. జిల్లావ్యాప్తంగా 262 మందిని బైండోవర్ చేశారు.
జిల్లాలో 15 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులతో చెక్పోస్టుల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 7 చెక్పోస్టులు, 8 అంతర్ జిల్లా సరిహద్దుల వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు విస్తృతంగా చేపట్టారు. జిల్లాకు ఆనుకొని ఉన్న కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన
చంద్రకల్ వద్ద, కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కస్తూరుపల్లి వద్ద, బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైల్వార్, ఇందర్చెడ్, నవాంగి వద్ద, కరన్కోట్ పీఎస్ పరిధిలో కొత్లాపూర్ వద్ద, బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో బొపనారం వద్ద అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.