చండూరు, ఆగస్టు 07 : అవినీతికి పాల్పడుతున్న అధికారులు, లంచాలు తీసుకుంటున్న వారి పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని, ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. తనకు పదిసార్లు ఎమ్మెల్యేగా ఉండాలనే ఆశ లేదని, రెండుసార్లు మునుగోడు ప్రజలు అవకాశం ఇచ్చారని ఇక చాలు అన్నారు. శుక్రవారం చండూరు మండల పరిషత్ అభివృద్ధి సర్వసభ్య సమావేశానికి హాజరై ఆయన మాట్లాడారు. సమావేశంలో చండూరు మండల వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన వివరాలను 17 శాఖలకు చెందిన అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
వ్యవసాయం ఉద్యానవన శాఖకు సంబంధించి జరిగిన చర్చలో మునుగోడు నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగులో రైతులకు అయ్యే ఖర్చు, వచ్చే లాభాలకు సంబంధించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో రైతులు ఆయిల్పామ్ సాగుకు మల్లేల అధికారులు రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ఫామ్ సాగును మునుగోడు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం అంతా కల్తిమయమైపోయిందని ఆహారం ఔషధంగా మారాలంటే సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు.
సేంద్రీయ వ్యవసాయం అంటేనే మునుగోడు నియోజకవర్గం గుర్తొచ్చేలా ఇప్పటి నుండే రైతులను ప్రోత్సహించాలని కోరారు. ప్రతి గ్రామం నుండి సిన్సియర్గా సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులను ఎంపిక చేసి వారి ద్వారా మిగతా రైతులను కూడా ప్రోత్సహించేలా చూడాలన్నారు. సేంద్రీయ పంటలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే బాధ్యత తనదని భవిష్యత్లో మునుగోడు నియోజకవర్గ సేంద్రీయ పంటలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మండల ప్రత్యేక అధికారి కె.నాగమల్లేశ్వరరావు, ఎంపీడీఓ బండారు యాదగిరి, చండూరు మండల వివిధ శాఖల అధికారులు, చండూరు మండల గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.