Allu Arjun | అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాకా’ షూటింగ్ ప్రస్తుతం ముంబై కేంద్రంగా శరవేగంగా జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ముంబైలోనే కొన్ని ప్రత్యేక సెట్లు వేసి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల కుటుంబంతో కలిసి వెకేషన్కు వెళ్ళొచ్చిన అల్లు అర్జున్, హైదరాబాద్లో అభిమానులను కలిసిన తర్వాత తిరిగి ముంబై సెట్స్లో జాయిన్ అయ్యారు.
అయితే అసలు ప్లాన్ ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి ఒక ముఖ్యమైన షెడ్యూల్ దుబాయ్లో జరగాల్సి ఉంది. కానీ ఇరాన్-యుద్ధం కారణంగా భద్రతా కారణాల రీత్యా దుబాయ్ షెడ్యూల్ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో దర్శకుడు అట్లీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, దుబాయ్లో జరగాల్సిన షూటింగ్ను కూడా ముంబైలోనే భారీ సెట్లు నిర్మించి పూర్తి చేస్తున్నారు. వేర్వేరు లొకేషన్ల చుట్టూ తిరగకుండా, ఒకే ప్రాంతంలో ప్రత్యేక సెట్లు వేసి షూటింగ్ను శరవేగంగా ముగిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె తన పాత్రకు సంబంధించిన షూటింగ్ను దాదాపుగా పూర్తి చేసుకున్నారు. దీపికా ప్రెగ్నెంట్ కావడంతో ఆమెకు సంబంధించిన పార్ట్ను అట్లీ ముందుగానే ప్లాన్ చేసి కంప్లీట్ చేశారు. మరోవైపు, ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) బాధ్యతలను ఒక ప్రముఖ హాలీవుడ్ స్టూడియో నిర్వహిస్తోంది. వారి సాంకేతిక అవసరాలకు తగినట్లుగా ముంబైలో ఒక భారీ సౌండ్ స్టేజ్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ భారీ సెట్లు, హాలీవుడ్ టెక్నీషియన్ల భాగస్వామ్యం, నటుల భారీ రెమ్యునరేషన్ల కారణంగా ‘రాకా’ బడ్జెట్ ఊహించిన దానికంటే ఎక్కువే అవుతోందని బాలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.