బడంగ్పేట, జూలై 2 : ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఫ్యాబ్ సిటీ ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కోటి రూపాయల నిధులు కేటాయించిందన్నారు. ఆలయ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు. ఆలయంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.
మహేశ్వరం నియోజక వర్గంలో ఉన్న అన్ని పురాతన ఆలయాల అభివృద్ధికి అడిగిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయించారన్నారు. రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఆమె అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా యాదాద్రీ ఆలయాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దారన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలో రెండు విడుతలుగా ఆలయాల అభివృద్ధికి రూ.8కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే మహేశ్వరంలో శివగంగ ఆలయం, ఆర్కేపురం ఖిలా మైసమ్మ ఆలయం, బాలాపూర్లో వేణుగోపాల స్వామి ఆలయం, జిల్లెలగూడ వేంకటేశ్వర స్వామి ఆలయానికి నిధులు కేటాయించామన్నారు. అన్ని ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
కుల వృత్తులకు అండగా సీఎం కేసీఆర్
కుల వృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎన్ రెడ్డి గార్డెన్లో ఆదివారం నిర్వహించిన గౌడ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌడ సంఘం నాయకులు మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనా లతో సంఘం మరింత బలపడుతున్నదన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.