“వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లో ధరణి పోర్టల్ ఒక సంచలనం.. ధరణి వచ్చినప్పటి నుంచి జాప్యానికి, లంచాలకు కాలం చెల్లింది. అధికారులు కేవలం 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి డాక్యుమెంట్ను చేతికందిస్తున్నారు. రికార్డుల నిర్వహణను సైతం ఒక పద్ధతిలో పకడ్బందీగా చేపడుతున్నారు. ధరణి అంటేనే ఓ నమ్మకం, ఓ ధైర్యం” అని అన్నదాతలు ముక్తకంఠంతో చెబుతున్నారు.
వికారాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్తో రైతాంగానికి పారదర్శక సేవలందుతున్నాయి. అదనంగా పైసా ఖర్చు లేకుండా, ఎలాంటి అవకతవలకు తావులేకుండా భూ రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. ధరణి పోర్టల్లోనే భూముల విలువ, స్టాంప్ డ్యూటీ ధరలు చూపిస్తుండడంతో అధిక వసూళ్లకు చెక్ పడింది. అంతేకుండా ఆయా మండల కేంద్రాల్లోనే ధరణి సేవలు అందుబాటులో ఉండడంతో అన్నదాతలకు వ్యయ ప్రయాసలు తప్పాయి. స్లాట్ బుకింగ్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వరకు అంతా ఆన్లైన్లోనే జరుగుతుండడంతో అవినీతికి అడ్డుకట్ట పడింది. ధరణి దరఖాస్తులను వికారాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నది. మ్యుటేషన్స్, సక్సెషన్స్, ప్రొహిబిటెడ్, జీపీఏ వంటి పనులు చకాచకా జరుగుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 75 వేలకుపైగా దరఖాస్తులు రాగా, ఇప్పటికే 98 శాతం దరఖాస్తులను జిల్లా యంత్రాంగం పరిష్కరించింది. ధరణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం లభించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో జిల్లా రైతాంగానికి పారదర్శకంగా సేవలందుతున్నాయి. ధరణి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి డబ్బుతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. ఏ దరఖాస్తు వచ్చినా ఎప్పటికప్పుడు జిల్లా రెవెన్యూ యంత్రాంగం పరిష్కరిస్తున్నది. ధరణి పోర్టల్ ద్వారా మ్యుటేషన్స్, సక్సెషన్స్, ప్రొహిబిటెడ్, జీపీఏ తదితరాలకు సంబంధించి జిల్లాలో 75 వేలకుపైగా దరఖాస్తులు రాగా, వీటిలో 98 శాతం దరఖాస్తులను జిల్లా యంత్రాంగం పరిష్కరించింది. కలెక్టర్ మొదలుకొని ఆయా మండలాల తహసీల్దార్ల వరకు తమ లాగిన్కు వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తున్నారు. ధరణి పోర్టల్ ద్వారా మ్యుటేషన్స్, సక్సెషన్స్, ఆధార్ సీడింగ్, జీపీఏ, ఆర్గనైజేషన్ పీపీబీ, ప్రొహిబిటెడ్ జాబితా, పీపీబీ లేకుండా సక్సెషన్, కోర్టు కేసుల ద్వారా పీపీబీ, పాసు పుస్తకం లేకుండా నాలా, కోర్టు కేసు-ఇంటిమేషన్, పీపీబీ-నాలా, అన్లాక్ పీపీబీ ఆఫ్ పీపీ ఆప్షన్లు, గ్రీవెన్స్ ఆన్ ల్యాండ్ మ్యాటర్స్ ఆప్షన్స్ ఉండగా, సంబంధిత ఆప్షన్లకు సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తున్నారు.
ఆయా ప్రాంతాలను బట్టి పోర్టల్లోనే స్టాంప్ డ్యూటీ ధరలు చూపిస్తుండడంతో డాక్యుమెంట్రైటర్స్ కానీ, మీ సేవ నిర్వహకులుగాని అధికంగా డబ్బులు వసూలు చేసేందుకు వీలు లేకుండాపోయింది. గతంలో మాదిరిగా మారుమూల గ్రామం నుంచి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సక్సెషన్, పార్టీషన్ సేవలకై పట్టణాలకు రావాల్సిన అవసరం లేకుండా మండల కేంద్రాల్లోనే సేవలందుతున్నాయి. మరోవైపు ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సీఎం కేసీఆర్ ఆదేశాలతో భూములకు సంబంధించి పెండింగ్ దస్ర్తాలు లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. గతంలో వారసత్వంగా వచ్చే భూములను వారసుల పేరిట మార్చేందుకు రైతులు ఏండ్ల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. 45 రోజుల్లో పూర్తి చేయాల్సిన వారసత్వ రిజిస్ట్రేషన్ను సంవత్సరాలు గడిచినా పూర్తయ్యేది కాదు. ప్రస్తుతం రైతులకు ఈ బాధలన్నీ తప్పాయి. ప్రస్తుతం వారసత్వ రిజిస్ట్రేషన్కై పట్టాదారు పాసు పుస్తకం, పట్టాదారు మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల అంగీకార పత్రం, ఇద్దరు సాక్షుల ఆధార్ కార్డులతో మీ సేవలో స్లాట్ బుక్ చేసిన 24 గంటల్లో రిజిస్ట్రేషన్కు పూర్తి కావడంతోపాటు కుటుంబ సభ్యుల పేరిట వెంటనే కొత్త పట్టాదారు పాసు పుస్తకం జారీ కావడంతోపాటు ఒరిజినల్ పట్టాదారు పాసు పుస్తకం నేరుగా రైతుల ఇంటికే అందిస్తున్నారు. స్లాట్ బుకింగ్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వరకు ధరణి పోర్టల్ ద్వారానే ప్రక్రియ జరుగుతుండడంతో అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది.
ధరణితో త్వరగా రిజిస్ట్రేషన్..
ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన నాటి నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ఈసీగా అయ్యింది. మీ సేవలో స్లాట్ బుక్ చేసుకొంటే సరిపోతుంది. స్లాట్ బుక్ తేదీ ప్రకారం ఆఫీసుకు వెళ్లి తక్కువ సమయంలో రిజిస్ట్రేషన పూర్తవుతుంది. ఒకప్పుడు అధికారుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడేవారం.
– నారాయణరెడ్డి, రైతు, రుద్రారం. కొడంగల్
పని సులభతరం..
నాభర్త చనిపోయిండు.. ఆయన పేరుమీదున్న భూమిని విరాసత్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నా. ఓ తేదీ ఇచ్చిండ్రు.. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాను. కాగితాలను చూసి నన్ను ఫొటో దించారు. నా వేలు ముద్ర తీసుకున్నారు. నీ భర్త పేరిట ఉన్న భూమి నీపేరుమీద మారిందని చెప్పారు.
– కావలి బందెమ్మ. చిగురాల్పల్లి. పరిగి మండలం
ధరణి వల్ల పని ఈజీ..
ధరణి వల్ల పని సులభతరంగా మారింది. గతంలో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే దళారులను ఆశ్రయించి అధిక డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకుని, ఇచ్చిన తేదీన వెళ్తే పనిపూర్తి చేస్తున్నారు. ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా పని పూర్తి చేసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది.
– మహ్మద్ వాజిద్, సయ్యద్ మల్కాపూర్, పరిగి మండలం
కష్టాలు తీరాయి..
సీఎం కేసీఆర్ రైతుల కోసం తీసుకొచ్చిన ధరణితో కష్టాలు తీరాయి. ఇదివరకు దళారుల చేతిలో నలిగిపోయేది. నేడు తాహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సులువుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం. గతంలో చేతులు తడిస్తేనే పని జరిగేది. రైతులకు నిజమైన దేవుడు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రైతు రాత మారింది.
– తుప్పుడు బాలకృష్ణ, ఖాంజాపూర్, తాండూరు రూరల్
నిమిషాల్లో రిజిస్ట్రేషన్..
ధరణి పోర్టల్తో నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. గతంలో మర్పల్లి నుంచి 40 కి.మీ దూరం వికారాబాద్కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకొనేది. నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పెట్టి సమస్యలను పరిష్కరించారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెంటనే పాసు పుస్తకం చేతికి రావడం సంతోషంగా ఉన్నది.
– గోపాల్ మర్పల్లి తండా, మర్పల్లి మండలం
రిజిస్ట్రేషన్ సులువైంది..
ధరణి పోర్టల్తో రిజిస్ట్రేషన్ సులువైంది. ఒకప్పుడు భూముల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్కు వికారాబాద్కు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ధరణి పోర్టల్తో మండల తహసీల్దార్ కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ జరగడం సంతోషంగా ఉన్నది. మధ్య దళారుల ప్రమేయం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్ జరుగుతుండడంతో ఖర్చులు తగ్గాయి.
– దుర్గయ్య, టేకులపల్లి, మోమిన్పేట
దళారులను ఆశ్రయించేబాధ తప్పింది
ధరణి పోర్టల్ రావడంతో రిజిస్ట్రేషన్ల కోసం దళారులను ఆశ్రయించే బాధ తప్పింది. నేను హైదరాబాద్లో డెలివరీ బాయ్గా పని చేస్తా. మా తండాలో ఐదు గుంటల భూమి కొనుగోలు చేశా. భూమి రిజిస్ట్రేషన్ కోసం మీసేవ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకుంటే శనివారం సమయం ఇచ్చారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తయింది. కొన్నవారు, అమ్మినవారు, ఇద్దరు సాక్షులుంటే చాలు రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
– ముడివత్ రమేశ్, బోడబండతండా, బొంరాస్పేట మండలం
ధరణి సేవలతోఅన్నదాతలకు ఎంతో మేలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణి పోర్టల్తో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతున్నది. భూ పట్టామార్పిడి నిముషాల్లో అవుతున్నది. ఇదివరకు మూడు, నాలుగు నెలల వ్యవధి పట్టేది. కానీ ధరణి వచ్చిన తరువాత భూముల పట్టా మార్పిడిలు సక్సెషన్, మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్లు వేగంగా జరుగడంతోపాటు నిముషాల్లో పట్టపాసుపుస్తకాల్లో భూముల వివరాలను నమోదు చేసి అప్పటి కప్పుడు అందిస్తున్నారు.
-గోపాల్, రైతు, పెద్దేముల్ గ్రామం, మండలం