విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ‘మన ఊరు-మన బడి’తో కార్పొరేట్ స్థాయిలో సర్కారు బడుల్లో సకల సౌకర్యాలను కల్పిస్తున్నది. నాణ్యమైన విద్యను అందిస్తుండడంతో పాటు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో సన్నబియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం పెడుతున్న విషయం తెలిసిందే. మరో అడుగు ముందుకేస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దసరా నుంచి ‘ముఖ్యమంత్రి అల్పాహార’ పథకం కింద బ్రేక్ ఫాస్ట్ను అందించాలని నిర్ణయించారు. రాగిజావ, మధ్యాహ్న భోజనానికి మధ్యలో రవ్వ ఉప్మా, పొంగల్, కేసరి, కిచిడీ తదితర టిఫిన్ అందించనున్నారు. ‘ముఖ్యమంత్రి అల్పాహార’ పథకం అమలుతో రంగారెడ్డి జిల్లాలో 1,309 పాఠశాలల్లోని 1,43,500 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. సీఎం కేసీఆర్ తీసుకున్న బ్రేక్ ఫాస్ట్ నిర్ణయంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్కారు తీసుకుంటున్న చర్యలతో అధిక శాతం తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): ‘ఇప్పటివరకు ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.‘ముఖ్యమంత్రి అల్పాహార’ పథకాన్ని దసరా పండుగ నుంచి మొదలు పెట్టనున్నారు. ఉదయం పూట రాగి జావ, కోడిగుడ్డును అందిస్తున్నది. అనంతరం బ్రేక్ ఫాస్ట్ను అందించనున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో 1,309 పాఠశాలల్లోని 1,43,500 మంది విద్యార్థులకు లబ్ధి కలుగనున్నది.
బడికి వచ్చే పేద విద్యార్థులు ఆకలితో ఉండొద్దనే ఉద్దేశంంతో ఇప్పటికే ప్రభుత్వం ప్రార్థనకు ముందు రాగి జావ, ఉడికించిన గుడ్డును అందిస్తున్నది. మధ్యాహ్నం సన్నబియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఇకపై ‘ముఖ్యమంత్రి అల్పాహార’ పథకంలో భాగంగా బ్రేక్ ఫాస్ట్ను అందించనున్నారు. రవ్వ ఉప్మా, పొంగల్, కేసరి, కిచిడీ వంటివి మెనూలో అందించేందుకు విద్యాశాఖ పరిశీలన జరుపుతున్నది. ప్రస్తుతం అందిస్తున్న రాగిజావ, మధ్యాహ్న భోజనానికి మధ్యలో బ్రేక్ ఫాస్ట్గా విద్యార్థులకు ఇవ్వనున్నారు. 10వ తరగతిలోపు పాఠశాలల విద్యార్థులందరికీ ఈ అల్పాహారాన్ని అందిస్తారు. దసరా నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 881 ప్రాథమిక పాఠశాలల్లో 63వేల మంది, 181 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 15,500 మంది, 248 హైస్కూల్స్లో 65వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. ‘ముఖ్యమంత్రి అల్పాహార’ పథకం వల్ల జిల్లాలోని 1,309 పాఠశాలల్లోని 1,43,500 మందికి లబ్ధి కలుగనున్నది. సమైక్య రాష్ట్రంలో దొడ్డు బియ్యం, పురుగుల అన్నం, నీళ్ల చారుతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించారు. చాలామంది ఈ భోజనాన్ని తినేందుకు అయిష్టత చూపడంతోపాటు అస్వస్థతకు గురైన సందర్భాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో నాణ్యమైన సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తుండగా..దసరా నుంచి బ్రేక్ ఫాస్ట్ సైతం అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు చక్కని బోధనతోపాటు మంచి పోషకాహారం సైతం అందుతుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మరింత మెరుగుపడతాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.