ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోకి నీరు వచ్చే ప్రధాన కాల్వ నుంచి పోచారం, కర్ణంగూడ రోడ్డు ఉండేది. ఈ వాగులో ఎప్పుడు నీరు ఉండడం వల్ల ఎండాకాలం మాత్రమే ప్రయాణం చేసేవారు. వానకాలం వాగు దాటాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.10కోట్ల వ్యయంతో వంతెనను నిర్మించారు. దీంతో కర్ణంగూడ, చర్లపటేల్గూడ గ్రామస్తులకు దూరభారం తగ్గింది. కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్గూడ తదితర గ్రామాలకు చెందిన కూరగాయలు, పాల వ్యాపారులు నేరుగా పోచారం నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు. పది గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం సులభతరం కావడం గమనార్హం.
ఇబ్రహీంపట్నం, మే 26 : ఉమ్మడి రాష్ట్రంలో నిధుల కొరత అధికంగా ఉండటం వలన రవాణా సౌకర్యం అస్తవ్యస్తంగా ఉండేది. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే మారుమూల ప్రాంతాల్లో వాగులు, వంకలు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ప్రత్యేక నిధులు రావటంతో వంతెనల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు. దీంతో రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో గతంలో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే వాగులు, వంకలు దాటేవారు.
ప్రస్తుతం వాగుల స్థానంలో వంతెనల నిర్మాణం జరిగింది. ఇందుకు ఉదాహరణే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కర్ణంగూడ-పోచారం గ్రామాల మధ్య నిర్మించిన వంతెన, గతంలో కర్ణంగూడ నుంచి పోచారం వెళ్లాలంటే ఇబ్రహీంపట్నం లేదా, ఎలిమినేడు మీదుగా వెళ్లాల్సి వచ్చేది. ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోకి నీరు వచ్చే ప్రధాన కాల్వనుంచి పోచారం, కర్ణంగూడ రోడ్డు ఉండేది. ఈ వాగులో ఎప్పుడు నీరు ఉండటం వలన ఎండాకాలం మాత్రమే ప్రయాణం చేసేవారు. వర్షాకాలంలో ఈ వాగులో నీరు ఎక్కువగా ఉండటం వలన నడిచివెళ్లే పరిసితి కూడా ఉండేదికాదు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.6కోట్లతో ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పెద్దవాగుపై వంతెన నిర్మాణం చేపట్టారు. కేటాయించిన రూ.6కోట్లతో పనులు పూర్తి కావటంతో మరో రూ.4కోట్లను అదనంగా కేటాయించారు. దీంతో రూ.10కోట్ల వ్యయంతో ఈ వంతె నిర్మాణం పూర్తయ్యింది.
వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత కర్ణంగూడ నుంచి పోచారం మీదుగా హైదరాబాద్కు వెళ్తున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత కర్ణంగూడ, చర్లపటేల్గూడ గ్రామస్తులకు దూరభారం తగ్గింది. అలాగే, కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్గూడ గ్రామాలకు చెందిన కూరగాయలు, పాలు నగరానికి తరలించే వ్యాపారులు పోచారం నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపైన వాగు ఉదృతికి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. దీంతో ఈ ప్రాంతంలో వంతె నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.6కోట్లను కేటాయించింది.
ఈ నిధులతో పనులు చకచకా సాగుతున్నాయి. అలాగే, అబ్దుల్లాపూర్మెట్ లష్కర్గూడ గ్రామాల మధ్యన ఉన్న వాగుకూడా ప్రమాదకరంగా మారింది. వర్షాకాలంలో ఈ వాగుపై వరద ఉధృతి పెరిగిపోతుంది. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఇద్దరు వాగులో కొట్టుకుపోయి మరణించారు. ఈ వాగుపై వంతెన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10కోట్లను కేటాయించింది. ఈ వంతెన నిర్మాణం పనులు కూడా చకచకా సాగుతున్నాయి.
గతంలో కర్ణంగూడ-పోచారం గ్రామాల మధ్యన ఉన్న వాగుతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు ఉధృతంగా ప్రవహించే సమయంలో రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయేవి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించి వాగుపై వంతెన నిర్మించటం ద్వారా రాకపోకలు సులభతరంగా మారింది. వంతెన నిర్మాణంతో కర్ణంగూడ, చర్లపటేల్గూడతో పాటు ఇతర గ్రామాలకు చెందిన రైతులు, పాలవ్యాపారులకు ఎంతో మేలు జరిగింది.
– కవిత, సర్పంచ్ కర్ణంగూడ
పోచారం-కర్ణంగూడ వాగుతో నిత్యం నానా అవస్థలు పడుతూ..ఇబ్బందులకు గురయ్యేవాళ్లం. గత ప్రభుత్వాలు వాగును పట్టించుకున్న పాపానపోలేదు. ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఎమ్మెల్యే ప్రత్యేక సహకారంతో వంతెన నిర్మాణం పూర్తికావటం ఎంతో సంతోషకరం. వాగు నిర్మాణానికి కృషిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే కిషన్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
– నిట్టు జగదీశ్వర్, స్థానికుడు