వికారాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : యాసంగి రైతాంగానికి కష్టకాల మొచ్చింది. అన్నదాతలను అప్పులపాలు అవుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా భూగర్భజలాలు తగ్గడంతో వరి పంట ఎండిపోయింది. పంట పొలాలు నెర్రలు బారడంతో రైతన్న కండ్లల్లో కన్నీళ్లు తిరుగుతున్నయ్. జిల్లాలో దాదాపు 20వేల ఎకరాల్లో వరి పంట ఎండినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా కులకచర్ల, దౌల్తాబాద్, బొంరాస్పేట మండలాల్లో ఎండిన పంటలను గుర్తించారు.
రికార్డు స్థాయిలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. రోజురోజుకూ బోర్లలో నీటినిల్వలు తగ్గుతుండడంతో రైతాంగం ఆందోళనకు గురవుతున్నది. రానున్న ఏప్రిల్లో బోర్లలో నీటినిల్వలు పూర్తిగా తగ్గే ప్రమాదం ఉన్నది. ప్రస్తుతం 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండగా, ఏప్రిల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు మించి నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా. మరోవైపు ఎండిన పంటలను కొందరు రైతులు పశువులను మేపుతున్నారు. పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
యాసంగి సీజన్లో 84 వేల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. అత్యధికంగా బొంరాస్పేట మండలంలో 12,175 ఎకరాలు, దౌల్తాబాద్లో 11,883, దోమలో 11,769, యాలాలలో 10,903, కొడంగల్లో 7202, కులకచర్లలో 5686, పరిగిలో 5162, తాండూరులో 4962, ధారూరులో 4547, బషీరాబాద్లో 3991, పెద్దేముల్లో 3097, చౌడాపూర్ మండలంలో 2485 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. అయితే ఇప్పటి వరకు సాగైన వరి పంటలో సుమారు 20 వేల ఎకరాల వరకు ఎండినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో మెజార్టీ భాగం బోర్లపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఏప్రిల్ రెండో వారం వరకు బోర్లలో నీటి నిల్వలు తగ్గకుంటే వరి పంట చేతికొచ్చే అవకాశాలున్నాయి. లేదంటే సాగు చేసిన దానిలో 70 శాతానికిపైగా నష్టపోయే ప్రమాదమున్నది.
జిల్లాలో భూగర్భజలాలు ప్రస్తుతం 13.07 మీటర్ల లోతుకు అడుగంటిపోయాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి 11.16 మీటర్ల మేర నీటి నిల్వలుండగా, కొన్ని రోజుల్లోనే రెండు మీటర్ల మేర తగ్గాయి. రానున్న ఏప్రిల్, మే నెల వరకు ప్రమాదకర స్థాయిలో భూగర్భ జలాలు తగ్గే ప్రమాదం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మెజార్టీ చెరువుల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. బొంరాస్పేట మండలంలోని గౌరారం, పరిగి మండలంలోని నస్కల్, రంగంపల్లి గ్రామాల్లో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోవడం గమనార్హం.
పెద్దేముల్ మండలంలోని నాగులపల్లిలో 32.28 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. దోమ మండలంలోని దిర్సంపల్లిలో 31.20 మీటర్లకు, మర్పల్లి మండలంలోని నర్సాపూర్లో 28.97 మీటర్లకు, దర్గుపల్లిలో 22 మీటర్లకు, నవాబుపేట మండలంలోని మాదిరెడ్డిపల్లిలో 23.30 మీటర్లకు, బొంరాస్పేట మండలంలోని అంసన్పల్లిలో 29.22 మీటర్లకు, బూరాన్పూర్లో 25.95 మీటర్లకు, తాండూరు మండలంలోని జిన్గుర్తిలో 24.12 మీటర్లకు, యాలాల మండలంలోని దేవనూరులో 26.52 మీటర్లకు భూగర్భజలాలు అడుగంటిపోయాయి.
భూగర్భజలాలు అడుగంటి పోయి పంటలు ఎండిపోయాయి. రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేశా. రూ.40వేలు పెట్టిన. బోర్ల నీళ్లు లేవు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నా. పంటంతా పశువులకు మేతైంది. రోజూ పశువులను మేపుతున్నా. గత 10ఏండ్లలో ఇలాంటి పరిస్థితి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– బంకింటి గోపాల్రెడ్డి, రైతు పుట్టపహాడ్, కులకచర్ల మండలం
వరి పంట ఎండి పోయింది. పశువుల మేపుకునే పరిస్థితి వచ్చింది. వానలు లేక బోర్లలో గుంజుకుపోయినయ్. పెట్టుబడికి అప్పులు తెచ్చి పెట్టిన. ఎండిన పంటను చూస్తే దుఃఖమొస్తుంది. రెక్కల కష్టం ఆవిరైపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నా.
– మన్నె నర్సింహులు, సాల్వీడ్ కులకచర్ల మండలం