తాగునీటి కష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు తాగునీటి సమస్య లేకుండా ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరందించి తాగునీటి కష్టాలకు చెక్ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లడంతోపాటు ట్యాంకర్ల వద్ద యుద్ధాలు నెలకొన్న పరిస్థితులను ప్రజలు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. గత నెల రోజులుగా జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో ఓ వైపు భూగర్భజలాలు అడుగంటిపోవడంతోపాటు మిషన్ భగీరథ నీటి సరఫరా అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండడంతో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచే జిల్లాలో తాగునీటి సమస్య నెలకొనడం గమనార్హం.
మరోవైపు ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో మిషన్ భగీరథ నీరు ఎప్పుడొస్తయో తెల్వని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో వారానికి ఒక్క రోజు మాత్రమే నీటిని వదులుతున్నారు. కొన్ని గ్రామాల్లో అది కూడా లేకపోవడంతో వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. మున్సిపాలిటీల్లోనూ మిషన్ భగీరథ నీటి సరఫరా మూడు, నాలుగు రోజులకోసారి సరఫరా అవుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో తాగునీటి కోసం పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలను గాలికి వదిలేసింది. గతేడాది వేసవికాలంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చేసిన మరమ్మతులకు సంబంధించి రూ.4 కోట్ల నిధులు ఇంకా పెండింగ్లోనే ఉండడంతో ఈ ఏడాది తాగునీటి మరమ్మతుల పనులు ఏ విధంగా చేయించాలనే దానిపై సంబంధిత అధికారులకు తలనొప్పిగా మారింది.
జిల్లాలో ఫిబ్రవరి చివరి నాటికి 13.58 మీటర్ల లోతుకు అడుగంటిపోగా, మార్చి చివరి నాటికి ఒక మీటరు మేర నీటి నిల్వలు తగ్గి 14.53 మీటర్లకు నీటి నిల్వలు తగ్గడం గమనార్హం. ఎండల తీవ్రత పెరగడంతో జిల్లాలో భూగర్భజలాలు క్రమంగా తగ్గుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి చివరి నాటికి .53 మీటర్ల మేర నీటి నిల్వలు తగ్గాయి. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరీ దారుణంగా మారేలా కనిపిస్తున్నాయి.
జిల్లాలో గతేడాది మార్చి చివరి నాటికి జిల్లాలో 14.06 మీటర్ల లోతులో భూగర్భజలాలుండగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి 14.53 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఏప్రిల్ చివరితోపాటు మే వరకు భూగర్భజలాలు తీవ్రస్థాయిలో తగ్గే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మెజార్టీ చెరువుల్లో నీటి నిల్వలు 90 శాతం మేర తగ్గిపోయాయి.
చెరువులతోపాటు ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడం చూస్తే ఈనెలాఖరు నాటికి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కోట్పల్లి, లక్నాపూర్, జుంటుపల్లి, శివసాగర్, కాకరవేణి, అల్లాపూర్, నందివాగు, సర్పన్పల్లి ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూగర్భజలాలను పెంపొందించేందుకుగాను ప్రతి గ్రామపంచాయతీలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకుడు గుంతలను నిర్మించింది. మిషన్ భగీరథ కింద చెరువులు, కాలువల పూడికతీత, మరమ్మతులు చేపట్టింది. మిషన్ కాకతీయ కింద ఇంటింటికీ నల్లాల ద్వారా నీటి సరఫరా చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల బాగోగులను పూర్తిగా విస్మరించింది.
– వికారాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ)