– ఏటీడీఓ భారతికి విద్యార్థి సంఘాల వినతి
జూలూరుపాడు, ఆగస్టు 05 : జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నరసాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ భారతికి విద్యార్థి సంఘాల ప్రతినిధులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ, ఎస్ఎఫ్ఐ మండల కన్వీనర్ పృథ్వి మాట్లాడుతూ… పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకుని పాఠశాల చుట్టూ తక్షణమే ప్రహరీ గోడ నిర్మించాలని, నిరంతరం భద్రత కల్పించేందుకు డే అండ్ నైట్ వాచ్మెన్లను నియమించాలని కోరారు. అలాగే పాఠశాల అవసరాల నిమిత్తం ఖాళీగా ఉన్న 15 మంది వర్కర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున ఆశ్రమ పాఠశాలల్లో దోమల తీవ్రత పెరిగిందని, విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా వెంటనే దోమతెరలను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందాల్సిన ప్రభుత్వం యూనిఫామ్స్ను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అందజేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గిరిజన వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు అనిల్ కుమార్, బాలాజీ, మండల నాయకులు అఖిల్, చింటూ, ఎస్ఎఫ్ఐ మండల నాయకుడు తరుణ్ పాల్గొన్నారు.