నారాయణపేట : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి భారీ వర్షాల( Heavy Rains ) కారణంగా కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కృష్ణ నదిపై నిర్మించిన గుర్జాపూర్, యాదగిరి జిల్లా గూడూరు భీమా నదిపై ఉన్న గుగ్గల్ బ్యారేజీ ( Guggal barrage ) కి వరద నీరు పోటెత్తడంతో ఈ బ్యారేజీ 40 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.
ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద జలాలు తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు ( Jurala Project ) కు చేరుతుండటంతో నది పరివాహక ప్రాంతం జలకళను సంతరించుకుంది. నది పూర్తిగా నీటితో నిండిపోవడంతో తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కృష్ణ బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న వరద ప్రవాహం ఆహ్లాదకర దృశ్యాన్ని తలపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులతో పాటు ప్రయాణికులు కూడా బ్రిడ్జి వద్దకు చేరుకుని ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.
కృష్ణానదిలో ప్రవాహం రోజురోజుకు వరద ప్రవాహం పెరుగుతుందడడంతో జూరాల ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, వరద ఉధృతి కారణంగా నదిలో స్నానాలు చేయకుండా, చేపల వేటకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.