చండీగఢ్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఒక స్కూటీపై ఏకంగా లక్ష వరకు పెండింగ్ చలాన్లు ఉన్నాయి. తనిఖీలో గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ఇది తెలుసుకుని షాక్ అయ్యారు. ఒక వ్యక్తి నుంచి ఆ స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. (1 Lakh Traffic Fines) ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్లో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 4న గరుగ్రామ్లోని రాజీవ్ చౌక్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. హెల్మెట్ లేకుండా తప్పుడు మార్గంలో స్కూటీపై వెళ్తున్న ఒక యువకుడిని గమనించి ఆపారు. ఆ రైడర్ను ప్రశాంత్గా గుర్తించారు. స్కూటర్ పత్రాలు చూపించమని అతడ్ని అడగ్గా వాటిని చూపించలేకపోయాడు. దీంతో వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా దాని వివరాలను తనిఖీ చేశారు.
కాగా, ఆ స్కూటీపై ఏకంగా లక్ష వరకు పెండింగ్ చలాన్లు ఉండటం చూసి ట్రాఫిక్ పోలీసులు షాక్ అయ్యారు. 2017 నుంచి 2024 వరకు ఏడేళ్లలో పలు ట్రాఫిక్ నిబంధనలు పదేపదే ఉల్లంఘించినట్లు గుర్తించారు. పలుమార్లు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ఇన్సూరెన్స్ లేదా పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోవడం, ట్రాఫిక్కు వ్యతిరేక దిశలో నడపడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి సుమారు లక్ష వరకు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు తెలుసుకున్నారు. స్కూటర్ ఖరీదుకు రెట్టింపు కంటే లక్ష మేరకు ట్రాఫిక్ జరిమానాలు ఉండటంతో దానిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు సుమారు రూ. 50,000 విలువైన 2017 మోడల్ స్కూటర్ తన సోదరి పేరు మీద రిజిస్టరైనట్లు ప్రశాంత్ తెలిపాడు. మేదాంత ఆసుపత్రి సమీపంలోని ఒక మెడికల్ షాపులో పనిచేస్తున్నట్లు చెప్పాడు. అయితే లక్ష వరకు పెండింగ్ జరిమానాలు ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ఆ స్కూటర్ను స్వాధీనం చేసుకున్నట్లు అతడు వెల్లడించాడు.