యాసంగి సాగులో అన్నదాతలు నిమగ్నమయ్యారు. దుక్కులు దున్నడం, నారుమడులు పోయడం వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈసారి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 99,306 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 6,943 ఎకరాల్లో ఆయా పంటలను రైతులు సాగు చేశారు. నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో వరి పంటను సాగు చేసుకుంటుండగా.. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలను సాగు చేసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా, అధికశాతం రైతులు పత్తి సాగువైపే మొగ్గు చూపుతున్నారు.
మరోవైపు యాసంగికి అవసరమైన విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. గత పదేండ్లలో విత్తనాలు, ఎరువులకు ఎక్కడా కొరత లేనందున ఈ సీజన్లో కూడా అదే రీతిలో రైతులకు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యాసంగికి సంబంధించి 17,741 టన్నుల యూరియా, 6వేల టన్నుల డీఏపీ, 500 టన్నుల ఎస్ఎస్పీ, 1200 టన్నుల ఎంవోపీ, 12,500 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం కానుండగా.. ఇప్పటికే 5,588 టన్నుల మేర ఎరువులను అధికారులు రైతులకు పంపిణీ చేశారు.
-రంగారెడ్డి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో యాసంగి పంటల సాగు జోరందుకుంది. ఈసారి 99,306 ఎకరాల్లో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తున్నది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 6,943 ఎకరాల్లో పంటల సాగు పూర్తయింది. జిల్లాలో ప్రస్తుత యాసంగిలో అధిక శాతం రైతులు పత్తి సాగువైపే మొగ్గు చూపుతున్నారు. నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో వరి పంటను రైతులు సాగు చేసుకుంటుండగా.. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలను సాగు చేసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. పంటల సాగుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ ముందస్తుగా అందుబాటులో ఉంచింది.
గత నెలారంభం నుంచి యాసంగి సాగు ప్రారంభమైంది. నీటిపారుదల సదుపాయాలు పెరగడంతో యాసంగిలోనూ పెద్దఎత్తున రైతులు పంటలను సాగు చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో సాగు పనుల్లో మందకొడి నెలకొనగా.. అనంతరం మళ్లీ పంటల సాగు వేగవంతమైంది. కొన్ని చోట్ల ఇప్పటికే పంటల సాగు మొదలవ్వగా.. మరికొన్ని చోట్ల దుక్కులు దున్నే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఇంకా వరి పంటల సాగు మొదలుకాలేదు.
వరిసాగు కోసం నారుమడులు పోసుకున్నారు. వచ్చే వారం, పది రోజుల్లో వరినాట్లు పెద్దఎత్తున సాగనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వరి సాగయ్యే అవకాశాలున్నాయి. కొంతమంది రైతులు వానకాలం ధాన్యం అమ్మకాలు ముగిసిన తర్వాత నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అక్కడక్కడ ఇప్పటికే మొలకెత్తిన పంటల్లో కలుపు సైతం తీస్తున్నారు. విత్తనం మొలకెత్తని చోట రైతులు మరోసారి విత్తనాలు నాటుకుంటున్నారు.
జిల్లాలో యాసంగికి అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం వ్యవసాయ శాఖ ముందస్తుగా ప్రణాళికలు రూపొందించింది. అవసరమైన విత్తనాలు, ఎరువులను రైతులకు అందజేసేందుకు సిద్ధం చేసి ఉంచింది. విత్తనాలు, ఎరువులకు ఎక్కడా కొరత లేదని అధికారులు పేర్కొంటున్నారు. యాసంగి సీజన్కు యూరియా 17,741 టన్నులు, డీఏపీ 6వేల టన్నులు, ఎస్ఎస్పీ 500 టన్నులు, ఎంఓపీ 1200 టన్నులు, కాంప్లెక్స్ 12,500 టన్నులు అవసరం ఉండగా.. ఇప్పటికే 5,588 టన్నుల మేర ఎరువులను అధికారులు రైతులకు పంపిణీ చేశారు. ఇంకా 11,938 టన్నుల ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచారు.