వికారాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాలపై జిల్లా యంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. జిల్లాలోని ఏ ఒక్క రైతు కూడా వాటి బారినపడకుండా చర్యలకు ఉపక్రమించింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని రైతులకు రైతువేదిక భవనాల్లో ఎలా అప్రమత్తంగా ఉండాలో అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు నకిలీ విత్తనాలపై జిల్లాలోని షాపుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు కేసులు నమోదయ్యాయి. వ్యవసాయ-పోలీసు శాఖల ఆధ్వర్యంలో దాడులు చేసి కొడంగల్, యాలాల, దౌల్తాబాద్ మండలాల్లో రూ.39 లక్షల విలువ చేసే 23 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గతేడాది మూడు కేసులు నమోదు కాగా, రూ.14.77 లక్షల విలువ చేసే 11.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను, 2022-23లో 8 కేసులు నమోదుకాగా, రూ.35.28 కోట్ల విలువ చేసే 27.98 క్వింటాళ్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జిల్లా రైతాంగం నకిలీ విత్తనాల బారిన పడకుండా జిల్లా వ్యవసాయ శాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇందులో పత్తి సాగు చేసే రైతులు ఆ విత్తనాలను లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే కొనా లని సూచిస్తున్నది. అయితే కొందరు వ్యక్తులు గ్రామాల్లో హెచ్టీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు యత్నిస్తుం డడంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. తనిఖీలను ముమ్మరం చేశారు. కాగా నకిలీ విత్తనాల కట్టడికి ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్న టాస్క్ఫోర్స్ బృందాలను ఈ ఏడాది ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
సరిపడా విత్తనాలు సిద్ధం..
జిల్లాలో వానకాలానికి సంబంధించి సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచారు. అదేవిధంగా జిల్లాలో 2.63 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేయగా 5,42,400 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు, వరికి సంబంధిం చి 27,500 క్వింటాళ్ల విత్తనాలు, మొక్కజొన్న 4036 క్వింటాళ్లు, పెసర్లు-1040, కందులు-4500 క్వింటాళ్లు, మినుములు-400 క్వింటాళ్లు, సోయాబీన్-750 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అదేవిధంగా యూరియా, డీఏపీ, ఎన్పీకేఎస్, ఎంవోపీ, ఎస్ఎస్పీ ఎరువులు అన్ని కలిపి 75,437 మెట్రిక్ టన్నులు అవసరమని నిర్ణయించారు. యూరియా 32,329 మెట్రిక్ టన్నులు, డీఏపీ 17,719, కాంప్లెక్స్ ఎరువులు 19,877 , ఎంవోపీ 3658, ఎస్ఎస్పీ 1854 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని భావిస్తున్నారు. అయితే ఎరువులను పీఏసీఎస్, డీలర్లు, కంపెనీ గోదాంలు, మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే సరఫరా చేయాలని నిర్ణయించారు.
అప్రమత్తంగా ఉండాలి..
నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం తనిఖీలను ముమ్మరం చేశాం. నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండడంతోపాటు.. అనుమతి లేని హెచ్టీ పత్తి విత్తనాలను కొని మోసపోవద్దు. రైతులు నకిలీ విత్తనాల బారినపడకుండా ఉండేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.
– గోపాల్, వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి