ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు పోషకాలతో కూడిన రేషన్ సరఫరా చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ రైస్ను అందించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఫోర్టిఫైడ్ రైస్ను సరఫరా చేస్తున్నారు. ఈ బియ్యంలో ఐరన్, ఫోలిక్ విటమిన్ బీ-12 నిర్ణీత మోతాదులో ఉంటాయి. గర్భిణుల్లో రక్తహీనత, చిన్నారుల్లో ఎదుగుదల లేకపోవడం, వయస్సుకు తగిన బరువు పెరుగకపోవడం వంటి సమస్యలను అధిగమించవచ్చని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో 919 రేషన్ దుకాణాలు ఉండగా, 5,58,890 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ బియ్యం సరఫరాతో 18,35,605 మందికి లబ్ధి చేకూరనున్నది.
– షాబాద్, ఫిబ్రవరి 7
షాబాద్, ఫిబ్రవరి 7: ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేస్తున్నట్లు సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 919 రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. సాధారణ బియ్యం మాదిరిగా ఉండే ఈ ఫోర్టిఫైడ్ రైస్లో ఐరన్, ఫోలిక్ విటమిన్ బీ-12 నిర్ణీత మోతాదులో ఉంటాయి. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే గర్భిణుల్లో రక్తహీనత, చిన్నారుల్లో ఎదుగుదల లేకపోవడం, వయస్సుకు తగిన బరువు పెరుగకపోవడం లాంటి సమస్యలను అధిగమించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పోషకాలతో కూడిన బియ్యం సరఫరా
పోషకాలతో కూడిన బియ్యాన్ని ఫోర్టిఫైడ్ బియ్యం అంటారు. ఆహార పదార్థాల్లో పోషక లోపాన్ని గుర్తించి, కృత్రిమ పద్ధతి ద్వారా పోషకాలను కలిపే ప్రక్రియను ఫోర్టిఫికేషన్గా పిలుస్తారు. ఐరన్, ఫోలిక్, విటమిన్ బీ-12 నిర్ణీత మోతాదులో ఉంటాయి. ఇవి సాధారణ బియ్యంగానే ఉంటాయి. కాగా, పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చే సమయంలో ఎక్కువగా పాలిష్ చేయడంతో నూక, తవుడు రూపంలో పోషకాలు వెళ్లిపోతాయి. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి పోషకాలు శరీరానికి అందవు. ఈ నేపథ్యంలో గర్భిణుల్లో రక్తహీనత, చిన్నారుల్లో ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి సమస్యలు అధిగమించేందుకు ఐరన్, ఫోలిక్, విటమిన్ బీ-12 పోషకాల మిశ్రమం కలిగిన కృత్రిమ బియ్యాన్ని తయారు చేస్తారు. 99 కిలోల సాధారణ బియ్యంలో కిలో ఫోర్టిఫైడ్ మిశ్రమ బియ్యాన్ని కలిపి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో బియ్యంలో కావాల్సిన పోషకాలు ఉండడంతో ప్రజలు ఆరోగ్యంగా ఉండడంతోపాటు ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.
జిల్లాలో 5,58,890 రేషన్ కార్డులు
జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో 919 రేషన్ దుకాణాలున్నాయి. 5,58,890 రేషన్ కార్డులకుగాను 18,35,605 మంది లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. మహిళలు, చిన్నారులకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన జాతీయ కుటుంబ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 50శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని.. అదే విధంగా ఐదేండ్ల లోపు చిన్నారుల్లో 31.2శాతం మంది సాధారణ బరువుకంటే తక్కువ బరువు ఉండడంతో పాటు 35శాతం పిల్లల్లో వయస్సుకు తగ్గ ఎదుగుదల ఉండడం లేదని వెల్లడైంది. ఈ నేపథ్యంలో మహిళలు, చిన్నారులతోపాటు ప్రజలకు పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ బియ్యంతో కలిపి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనానికి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యాన్నందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఏప్రిల్ నుంచి పంపిణీకి ఏర్పాట్లు
– శ్యామారాణి, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్
ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తున్నాం. ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా ప్రజలందరికీ ఈ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలోని 919 రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.