ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై నిఘాను పెంచారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలతోపాటు అంతర్ జిల్లా సరిహద్దుల వద్ద కోడ్ ఉల్లంఘన జరుగకుండా 22 చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. అంతర్ జిల్లా సరిహద్దుల వద్ద 8, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలపాటు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్, 1950 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అంతేకాకుండా వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు, మండలాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో అక్రమంగా మద్యం, బెల్టుషాపులు నిర్వహించకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి అమల్లోకి రాగా.. మూడు రోజుల్లోనే అధికారులు రూ. 20.30 లక్షల నగదుతోపాటు 183 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న 14 మందిపై కేసు నమోదు చేశారు. జిల్లాలో 293 మంది రౌడీషీటర్లుండగా ఇప్పటివరకు 241 మందిని బైండోవర్ చేయగా.. 240 లైసెన్స్డ్ గన్లుండగా ఇప్పటికే 170 మంది డిపాజిట్ చేశారు. రూ.50 వేలకు మించి నగదును తరలిస్తే సరైన ఆధారాలు, ధ్రువీకరణ చూపాలని ఈసీ పేర్కొన్నది.
-వికారాబాద్, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ)
వికారాబాద్, అక్టోబర్ 12, (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా అంతటా తనిఖీలను అధికారులు ముమ్మరం చేశారు. కర్ణాటక రాష్ట్రం సరిహద్దుతోపాటు జిల్లాకు ఆనుకొని ఉన్న ఇతర జిల్లాల సరిహద్దుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ డబ్బు, మద్యం ఇరత్రాలను తరలించే వారిపై గట్టి నిఘా పెంచారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ముఖ్యంగా డబ్బు, మద్యం భారీగా తరలించే అవకాశాలున్న దృష్ట్యా జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు జిల్లా అంతటా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు ఉండేలా ఏర్పాట్లు చేశారు.
వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు, మండలాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద విస్తృతంగా వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై నేరుగా సామాన్య ప్రజానీకం కూడా ఫిర్యాదు చేసే విధంగా సీ-విజిల్ యాప్, 1950 టోల్ఫ్రీ నంబర్ను ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చింది. మరోవైపు గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపులపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడా కూడా బెల్టు షాపులను నిర్వహించకుండా జిల్లా పోలీసు, ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
ఎన్నికల అధికారులు నియమించిన ఫ్లయింగ్ స్కాడ్లతోపాటు పోలీసులు నిత్యం తనిఖీలు చేస్తున్నారు. మూడు రోజులుగా ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో విస్తృతంగా వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రూ.50 వేల మించి నగదును తరలించినట్లయితే సంబంధిత డబ్బుకు సంబంధించి సరైన ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఎలాంటి ఆధారాలు లేకపోయినట్లయితే సంబంధిత నగదును జిల్లా ఎన్నికల అధికారులకు అప్పజెప్తారు. రూ.10 లక్షలకు మించి నగదు పట్టుబడినట్లయితే సంబంధిత నగదును ఐటీ శాఖకు జిల్లా ఎన్నికల అధికారులు అప్పజెప్పడం జరుగుతుంది. మూడు రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.20.30 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో రూ.9.50 లక్షలు, మోమిన్పేట పీఎస్ పరిధిలో రూ.5 లక్షలు, బొంరాస్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని తుంకిమెట్లలో రూ.2 లక్షల నగదును వాహనాల తనిఖీల్లో భాగంగా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బెల్టు షాపులపై దాడులు చేయడంతోపాటు వాహనాల్లో తనిఖీల్లో మద్యం తరలిస్తుండగా పట్టుబడిన 14 మందిపై కేసులు నమోదు చేసి 183 లీటర్ల మద్యాన్ని ఇప్పటివరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 293 మంది రౌడీషీటర్లుండగా ఇప్పటివరకు 241 మందిని బైండోవర్ చేశారు. జిల్లాలో 240 లైసెన్సెడ్ గన్లు ఉండగా, ఇప్పటికే 170 మంది డిపాజిట్ చేయడం జరిగింది.
జిల్లాలో 15 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులతో చెక్పోస్టుల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో 7, అంతర్ జిల్లా సరిహద్దుల వద్ద 8 చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రకల్ వద్ద, కొడంగల్ పోలీస్స్టేషన్ పరిధిలో కస్తూరుపల్లి, బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మైల్వార్, ఇందర్చెడ్, నవాంగి, కరన్కోట్ పీఎస్ పరిధిలో కొత్లాపూర్, బంట్వారం పోలీస్స్టేషన్ పరిధిలో బొపనారం వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అంతర్జిల్లా సరిహద్దుల వద్ద నవాబుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైతాప్ఖాన్గూడ, మోమిన్పేట్ పీఎస్ పరిధిలోని మేకవనంపల్లి, మర్పల్లి పీఎస్ పరిధిలో కొంశెట్టిపల్లి, చన్గొముల్ పీఎస్ పరిధిలోని అంగడ్చిట్టంపల్లి ఎక్స్రోడ్, పరిగి పీఎస్ పరిధిలో రాఘవాపూర్, కొడంగల్ పీఎస్ పరిధిలోని హుస్నాబాద్, దుద్యాల అలేడ్, దౌల్తాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో దేవరఫస్లబాద్ వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.