న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనానికి తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు.
ఉమ్మడి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయం, అనంత పద్మనాభస్వామి ఆలయం, పరిగి పట్టణంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, కొడంగల్లోని వేంకటేశ్వరాలయాలతో పాటు జిల్లాలోని అన్ని వైష్ణవ ఆలయాల్లో భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేసి సామివారి కృపకు పాత్రులయ్యారు.
ఆలయాలన్నీ గోవింద నామస్మరణతో మార్మోగగా, స్వామివారి పల్లకీ సేవలు కన్నుల పండుగగా సాగాయి. పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.