రంగారెడ్డి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసిన అధికారులు
గతేడాది కన్నా రూ. 4,321 కోట్లు పెంపు
పంట రుణాలకు రూ.2,716 కోట్లు
ప్రాధాన్యతా రంగాలకు రూ.13,521 కోట్లు
ప్రాధాన్యేతర రంగాలకు రూ. 8,404కోట్లు
వ్యవసాయం, రూ.5,066 కోట్లు
2022-23 రుణ ప్రణాళికను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్
జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక సిద్ధమైంది. గతేడాది కంటే అధికంగా రూ. 4,321 కోట్ల లక్ష్యంతో రూపుదిద్దుకున్నది. ప్రాధాన్యతారంగాలకు రూ.13,521 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.8,404 కోట్లు కేటాయించాలని నిర్ణయించి.. 4,08,744 మందికి రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 5,066 కోట్ల రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు నిర్ణయించాయి. వార్షిక రుణ ప్రణాళికలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, మత్స్య, డెయిరీ, ఉద్యానవన రైతులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వానకాలం, యాసంగి సీజన్లలో కలిపి రూ.2,716 కోట్ల పంట రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ కేటాయింపు గతేడాది కంటే రూ.643 కోట్లు అధికం. లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక ప్రణాళికను గురువారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ ఆవిష్కరించారు. జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. చిన్న, సన్నకారు రైతులు, కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సూచించారు.
రంగారెడ్డి, జూన్ 23, (నమస్తే తెలంగాణ) : 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు మంజూరు చేసే రుణాల లక్ష్యాన్ని భారీగా పెంచుతూ జిల్లా లీడ్ బ్యాంకు అధికారులు ప్రణాళికను రూపొందించారు. ముఖ్యంగా రైతులకు అందజేసే పంట రుణాలను కూడా భారీగా పెంచారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.643 కోట్లను పెంచుతూ వార్షిక రుణ ప్రణాళికను తయారు చేశారు. వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు, పౌల్ట్రీ, మత్స్య, డెయిరీ, ఉద్యానవన రైతులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రాధాన్యతా రంగాలకు రూ.13,521 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ప్రాధాన్యేతర రంగాలకు రూ.8404 కోట్ల రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. ప్రతి ఏటా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించినప్పటికీ రుణాల మంజూరులో మాత్రం బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ ఆర్థిక సంవత్సరం అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలను మంజూరు చేసేందుకు కలెక్టర్ అమోయ్కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.
వార్షిక రుణ లక్ష్యం రూ.21,925 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ లక్ష్యాన్ని రూ.21,925 కోట్లుగా నిర్ణయించారు. అయితే జిల్లావ్యాప్తంగా ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు కలిపి మొత్తం 4,08,744 మందికి రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గతేడాది రూ.17,604 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను రూపొందించగా, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.4321 కోట్లను పెంచుతూ వార్షిక రుణ ప్రణాళికను తయారు చేశారు. ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళికలో 61.66 శాతం రుణాలను ప్రాధాన్యత రంగాలకు కేటాయించగా, మిగతా 38.33 శాతం రుణాలను ప్రాధాన్యేతర రంగాలతో ఇతర రంగాలకు కేటాయిస్తూ నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.5066 కోట్ల రుణాలను మంజూరు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాధాన్యత రంగాలకు అత్యధికంగా రూ.13,521 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.8404 కోట్ల రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. పౌల్ట్రీ, డెయిరీ, మత్స్య అభివృద్ధి, ఉద్యానవన, అటవీ భూఅభివృద్ధికి సంబంధించి 23,411 మంది రైతులకు రూ.1436 కోట్ల రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 81,864 మందికి రూ.7206 కోట్ల రుణాలిచ్చేందుకు టార్గెట్గా నిర్ణయించారు. సూక్ష్మతరహా పరిశ్రమలకు సంబంధించి 24,515 మందికి రూ.686 కోట్లు, చిన్నతరహా పరిశ్రమలకు – 51,544 మందికి రూ.3504 కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు – 5805 మందికి రూ.3015 కోట్ల రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరం విద్యా రుణాల కింద 1896 మంది విద్యార్థులకు రూ.94.50 కోట్లు, గృహ రుణాల కింద 10,105 మందికి రూ.1010 కోట్లు, పునరుత్పాదక శక్తి కింద 713 మందికి రూ.17.57 కోట్ల రుణాలను అందించనున్నారు.
పంట రుణాలు రూ.2716 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరానికి వానాకాలం, యాసంగి సీజన్లలో రూ.2716 కోట్ల పంట రుణాలను మంజూరు చేయాలని రుణ ప్రణాళికను రూపొందించారు. పంట రుణాలకు సంబంధించి గతేడాదితో పోలిస్తే భారీగా పెంచుతూ నిర్ణయించారు. గతేడాది పంట రుణాల లక్ష్యం రూ.2073 కోట్లుగా నిర్ణయించగా, ఈ ఆర్థిక సంవత్సరం రూ.643 కోట్ల మేర పంట రుణాలను పెంంచారు. జిల్లావ్యాప్తంగా 2,22,185 మంది రైతులకు వానకాలం, యాసంగి సీజన్లలో పంట రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. గతేడాది వానకాలం, యాసంగిలలో రూ.2073 కోట్ల రుణాలను 2,18,412 మంది రైతులకు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా రూ.726 కోట్ల రుణాలను బ్యాంకర్లు మంజూరు చేశారు. వానకాలం సీజన్కు రూ.1200 కోట్ల రుణాలను జిల్లా రైతాంగానికి మంజూరు చేయాలని నిర్ణయించగా.. రూ.468 కోట్లు రుణాలను, అదేవిధంగా యాసంగి సీజన్లో రూ.873 కోట్ల రుణాలకు రూ.258 కోట్ల రుణాలను మంజూరు చేశారు. ఈ ఏడాది మాత్రం అర్హులైన ప్రతి రైతుకూ పంట రుణాలందేలా జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ప్రభుత్వం రైతులకు పెట్టుబడి అందించేందుకు తీసుకువచ్చిన రైతుబంధు పథకంతో పంట రుణాలు తీసుకునే రైతులు తగ్గిపోయారు. పంట పెట్టుబడికి ప్రభుత్వమే ఆర్థిక సాయాన్ని అందిస్తుండడంతో రైతులు గతంలో మాదిరిగా రుణాల కోసం ఎదురుచూడడంలేదు.
వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసిన అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్
చిన్న, సన్నకారు రైతులతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కుటీర పరిశ్రమలు, చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించి రుణాలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రుణాలను అందించాలని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సకాలంలో రుణాలను మంజూరు చేయాలన్నారు.పంట రుణాల పంపిణీ, వ్యవసాయ కాల పరిమితి రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు, విద్య, గృహ రుణాల విషయంలో ఉదారత్వంతో బ్యాంకర్లు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ నందకిశ్ర్, జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, జడ్పీ సీఈవో దిలీప్కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.