ఇబ్రహీంపట్నం, మార్చి 28 : రానున్న పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి పోలీసులు, ఇతర ఎన్నికల సిబ్బంది సమష్టిగా పనిచేయాల్సిన అవసరముందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. అనంతరం పోలీసులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందితో ఆమె ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న చెక్పోస్టుల్లో నిఘాను మరింత పెంచాలన్నారు. చెక్పోస్టుల వద్ద లభించిన డబ్బులు, బంగారం, వెండి ఇతరత్రా ఆకర్షణీయ వస్తువులు దొరికిన వెంటనే కలెక్టర్ కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో అప్పజెప్పాలన్నారు. ఎన్నికల కోడ్కు విఘాతం కల్పించేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలు ముగిసే వరకు గ్రామాల్లో బెల్టు షాపులను కూడా పూర్తిస్థాయిలో మూసివేయాలన్నారు.
ఓటర్లను ప్రలోబాలకు గురిచేసే చర్యలను సహించవద్దన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరగడం కోసం పోలీసులు, రెవెన్యూ, ఇతర ఉద్యోగులు సమష్టిగా పనిచేయాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం పీవీఎస్ రాజు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, సీఐలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలున్నారు.