ధారూరు, ఫిబ్రవరి 1 : ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీ నియోజకవర్గం వికారాబాద్లో ఓ దళిత అధికారికి అవమానం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ కార్యాలయాన్ని శనివారం స్పీకర్ ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంపై విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్ సంజీవ పేరును ముద్రించలేదు. దీంతో అతడు దళిత వర్గానికి చెందిన అధికారి కాబట్టి, ఉన్నతాధికారులు కావాలనే ఆయన పేరును తొలగించినట్లు తెలుస్తున్నది.
ఇదే విషయమై సదరు అధికారి కూడా మీడియా ముఖంగా ఆవేదనను వ్యక్తం చేశారు. శిలాఫలకాల ముద్రణకు ముందు జాబితాలో కంప్యూటర్ డిజైనింగ్లోనూ ఆయన పేరు ఉన్నప్పటికీ శిలాఫలకంపై మాత్రం ఎందుకు వేయలేదని పలువురు దళిత సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఉద్దేశ పూర్వకంగానే జరిగిందని విమర్శిస్తున్నారు. దీంతో పాటు ఆ శాఖలో దళితులపై గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారులు వివక్షకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. డివిజనల్ ఇంజినీర్ కార్యాలయంలో ఉన్న అంబేద్కర్ చిత్రపటాన్ని ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకొచ్చి వారం రోజుల క్రితమే తీసివేయించారని సమాచారం. దీనిపై వికారాబాద్ జిల్లాలోని వివిధ సంఘాల నాయకులతోపాటు విద్యుత్ శాఖలోని దళిత ఉద్యోగులు ఇతర శాఖలోని దళిత సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
సూపరింటెండింగ్ ఇంజినీరు వెంటనే డివిజనల్ ఇంజినీర్ సంజీవకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అంబేద్కర్ చిత్రపటాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. శనివారం డివిజనల్ ఇంజినీర్కు జరిగిన అవమానంపై శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు విద్యుత్ శాఖలోని దళిత ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీంతోపాటు ఆ శిలాఫలకాన్ని తొలగించి డీఈ పేరును జత చేసి తిరిగి ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్ను డిమాండ్ చేస్తున్నారు. లేనిచో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.