రంగారెడ్డి, మార్చి 8(నమస్తే తెలంగాణ): సీజన్లు గడిచిపోతున్నా.. రంగారెడ్డి జిల్లాలో మిల్లర్ల నుంచి కస్టమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) మాత్రం వెనక్కి రావడం లేదు. 2022-23 యాసంగికి సంబంధించి సీఎంఆర్ గడువు ముగిసింది. అయినా.. ఇంకా 48 శాతం బియ్యం మిల్లర్ల వద్దే ఉండిపోయాయి. తాజాగా 2023-24 వానకాలానికి సంబంధించిన ధాన్యాన్ని సైతం మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించారు. గత కోటా పూర్తికాకపోయినప్పటికీ మళ్లీ మిల్లర్లకు కేటాయింపులు జరుపడం చర్చనీయాంశంగా మారింది. ఒక సీజన్ బియ్యాన్ని వాయిదా వేస్తూ.. మరొక సీజన్లో వచ్చే ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు పౌరసరఫరాల సంస్థ నిర్ణయించడం అక్రమాలకు ఊతమిచ్చినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
పౌర సరఫరాల సంస్థ నిబంధనల మేరకు ప్రతి సంవత్సరం సీజన్కు సంబంధించి ఆరు నెలల్లో మిల్లులకు కేటాయించిన ధాన్యానికి బియ్యం సేకరణ చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది రైస్ మిల్లర్ల అలసత్వంతో ప్రతి సీజన్లోనూ సీఎంఆర్ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నది. 2022-23 యాసంగికి సంబంధించిన ధాన్యాన్ని సైతం మరాడించడంలో మిల్లర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. సీఎంఆర్పై కేంద్రం ఇప్పటివరకు ఐదారుసార్లు గడువు పొడిగించింది. చివరగా.. ఫిబ్రవరి 29 వరకు గడువు పొడిగించిన కేంద్రం మరోసారి గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
అయినప్పటికీ రైస్ మిల్లర్లు అప్పగించాల్సిన బియ్యంలో ఇప్పటివరకు కేవలం 52 శాతం మాత్రమే ఇచ్చారు. ఈ సీజన్లో 28,156 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ 12 మిల్లులకు అప్పగించింది. ఇందుకు బదులుగా మిల్లర్లు 13,434 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ను ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉన్నది. ఇప్పటివరకు 14,721(52 శాతం) మెట్రిక్ టన్నులు మాత్రమే ఇవ్వగా.. ఇంకా 48 శాతం బియ్యం మిల్లర్ల వద్దే ఉన్నది. మిల్లర్లతో తరచూ సమావేశాలు నిర్వహించడంతోపాటు పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లుల్లో తనిఖీలు జరిపి ఒత్తిడి తెచ్చినప్పటికీ ఫలితం లేదు. మరో నెల రోజులు గడువు పొడిగించినా.. ఆలోపు పూర్తి మిల్లింగ్ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
గత యాసంగి కోటా పూర్తికానప్పటికీ.. 2023-24 వానకాలం బియ్యం సేకరణకు భారత ఆహార సంస్థ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పౌర సరఫరాల సంస్థ జిల్లాలోని 13 మిల్లులకు 9,879 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అప్పగించింది. క్వింటాలుకు 67 కిలోల చొప్పున 6,618 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ను మిల్లర్లు అప్పగించాల్సి ఉండగా అధికారులు సంబంధిత మిల్లింగ్పై దృష్టి పెట్టారు. ఎఫ్సీఐకి అందజేయాల్సిన ఒక సీజన్లోని బియ్యాన్ని వాయిదా వేస్తూ మరొక సీజన్లో వచ్చే ధాన్యం మిల్లింగ్ చేసి ఇస్తున్నారు.
అధికారులు ఒత్తిడి చేసిన సందర్భంలో కొందరు మిల్లర్లు బ్లాక్ మార్కెట్కు తరలించే రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సర్దుబాటు చేస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో యాసంగి లక్ష్యం పూర్తికానప్పటికీ.. మళ్లీ అదే మిల్లర్లకు వానకాలం ధాన్యాన్ని అప్పగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎఫ్సీఐ తీరు.. అక్రమాలకు ఊతమిచ్చినట్లేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.