సిర్గాపూర్, ఆగస్టు 5 : సంగారెడ్డి జిల్లాలో నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి స్థాయి లో నిండింది. బుధవారం తెల్లవారుజామున నీటి మట్టం 1493 అడుగులకు చేరుకుని అలుగు పారింది. నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరిగి మూడు రోజుల్లోనే ప్రాజెక్టు నిండి అలుగు దూకింది. ఎగువ ప్రాంతం నుంచి 1500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో ఔట్ ఫ్లో కొనసాగుతున్నదని సంబంధిత ఏఈఈ మల్లేశం తెలిపారు.
నల్లవాగు నీటి విడుదల : నల్లవాగు ప్రాజెక్టు అలుగు ద్వారా నీరు వృథా కాకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో బుధవారం ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే సంజీవరెడ్డి కుడి, ఎడమ తూముల ద్వారా పంట కాల్వలకు సాగు నీటిని విడుదల చేశారు. రెండు కాల్వల కింద చెరువులు నింపుతూ చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ హేమంత్కుమార్, ఏఈఈలు మల్లేశం, శ్రీవర్ధన్రెడ్డి, సిబ్బంది లష్కర్, రైతులు, నాయకులు పాల్గొన్నారు.