షాద్నగర్ రూరల్, ఏప్రిల్ 27 : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వరి పంటనే కాకుండా తీగ జాతి పంటలను కూడా సాగు చేసి అధిక దిగుబడులను సాధించొచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటలతోపాటు ఇతర లాభదాయక పంటలను సాగు చేయాలని సూచించడంతో మండలంలోని చాలా మంది రైతులు తీగ జాతి (పందిరి) పంటల సాగుకు అధికంగా మొగ్గు చూపుతున్నారు.
పంటల సాగు ఇలా..
తీగ జాతి(పందిరి)పంటలకు కొద్దిమొత్తంలో నీరు ఉం టే చాలు. అంతేకాకుండా కూలీల ఖర్చు కూడ ఉం డదు. ఈ కూరగాయల సాగు కోసం పందిరి వేసేందుకు ఎకరాకు సుమారు రూ. 2లక్షల 50 వేల వర కు ఖర్చు అవుతుంది. వీటిలో ప్రభుత్వం రూ. లక్ష వరకు సబ్సిడీ ఇస్తుంది. డ్రిప్కూ సబ్సిడీని అందిస్తుంది. ఈ తీగ జాతిలో ఇంచున్నర నీళ్లతో ఐదు ఎకరాల వరకు పంటలను సాగు చేయొ చ్చు. వరి, జొన్న, మామిడి, బత్తాయి తదితర తోటల సాగు కోసం వెచ్చించే ఖర్చు కన్నా ఈ తీగజాతి పంటల సాగు ఖర్చు చాలా తక్కువగా.. ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అందుకే మండలంలోని చాలా మంది రైతు లు తీగ జాతి పంటల సాగుపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తీగ జాతి పంటల సాగు పై ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలను అందించడంతోపాటు.. పంటలకు చీడ, పీడ పురుగులు సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. ఒక ఎకరంలో తీగ జాతి కూరగాయల సాగుకు దాదాపుగా రూ. 45 వేల వరకు ఖర్చు అవుతుంది. కూలీల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది.
ఆదర్శం.. ప్రవీణ్కుమార్రెడ్డి
మండలంలోని చిల్కమర్రి గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్రెడ్డి తీగ జాతి పంటలను సాగుచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన తనకున్న రెండు ఎకరాల పొలంలో అందరి లాగే వరి, జొన్న తదితర పంటలను సాగు చేయగా ఆశించిన స్థాయిలో లాభం రాలేదు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు పంటల సాగుపై అవగాహన కల్పించడంతో వారి సూచనలు, సలహాల మేరకు పందిరి విధానంలో కూరగాయలను సాగు చేస్తూ అధిక లాభా లు ఆర్జిస్తున్నారు.
లాభాలు బాగున్నాయి..
వరి, జొన్న, మామిడి పంటల కంటే పందిరి జాతి పంటలతో అధిక లాభాలను పొందొచ్చు. ఈ విధానంలో ఖర్చు తక్కువ, దిగుబడి ఎక్కువగా ఉంటుంది. రెండెకరాల పొలంలో పందిరి ఏర్పాటు కోసం ఎకరానికి రూ.2లక్షల 50 వేల చొప్పున దాదాపుగా రూ. ఐదు లక్షల వరకు ఖర్చు చేశా. ఈ మొత్తంలో సగభాగాన్ని ప్రభుత్వం సబ్సిడీ కింద అందజేసింది. రెండు ఎకరాల సాగు కోసం దాదాపుగా రూ. 85 వేలు ఖర్చు చేశా. సేంద్రియ, రసాయనిక ఎరువులను వినియోగించడం జరిగింది. ఈ పంట దిగుబడి 60 రోజుల నుంచే ప్రారంభమై ఏడాదిపాటు ఉం టుంది. రెండు ఎకరాలకు కలిపి మొత్తంగా రూ. 2.10 వేల ఆదాయం వచ్చింది. అన్ని ఖర్చులుపోనూ రూ. లక్షాకు పైగా మిగిలింది. ప్రభుత్వ ప్రోత్సాహం.. అధికారుల సూచనలు.. సలహాలతోనే అధిక దిగుబడులను సాధించా.
-ప్రవీణ్కుమార్రెడ్డి రైతు, చిల్కమర్రి గ్రామం
అధిక దిగుబడులు సాధించొచ్చు..
తీగ జాతి పంటల సాగుతో రైతులు అధిక దిగుబడిని సాధించొచ్చు. వీటి సాగుకు ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తున్నది. ఈ పంటలను తక్కువ నీటి వినియోగంతో సాగుచేసుకోవచ్చు. గ్రామాల్లోని రైతులకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన మందులను వివరిస్తున్నాం. మండలంలో దాదాపుగా 120 ఏకరాల్లో తీగజాతి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగును మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఈ పంటల సాగుపై మొగ్గు చూపుతున్నారు.
-ఉషారాణి, ఉద్యానవనశాఖ అధికారిణి
రైతులకు అండగా ప్రభుత్వం
రైతులు పందిరి జాతి పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ విధానంలో తక్కువ పెట్టుబడితో అధికంగా లాభాలను ఆర్జించొచ్చు. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుడటం సంతోషంగా ఉన్నది. తెలంగాణ సర్కార్ వచ్చాకే రైతులు ఆర్థికంగా ఎదుగుతున్నారు. సబ్సిడీలతో ఆదుకుంటున్నది.
-శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్, చిన్నచిల్కమర్రి గ్రామపంచాయతీ