యాచారం, మే 18 : వన్యప్రాణులను వేటాడితే క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని జిల్లా విజిలెన్స్ ఫారెస్ట్ అధికారి సుధాకర్రెడ్డి హెచ్చరించారు. మండలంలోని తాటికుంట మైసమ్మ ఆలయాన్ని ఆయన బుధవారం సిబ్బందితో కలిసి పర్యటించారు. అక్కడి పరిసరాలు, అడవి, చెరువు, కుంటలను ఆయన పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేటగాళ్లు అడవి పందుల కోసం నాటుబాంబులు ఉపయోగించడంపై ఆరా తీశారు. ఇటీవలే నాటుబాంబు దాడిలో గాయపడిన ఎద్దు యజమాని నారాయణతో మాట్లాడారు.
వన్యప్రాణులను వేటాడుతున్న వేటగాళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు సుధాకర్రెడ్డి తెలిపారు. ఉచ్చులు, నాటుబాంబులు వినియోగించి అడవి పందులు, నెమళ్లు, జింకలు, కుందేళ్లు, ఉడుములు ఇతర జంతువులు, పక్షులను వేటాడితే సహించేదిలేదన్నారు. తాటికుంట మైసమ్మ పరిసరాల్లో ప్లాస్టిక్ కవర్లను వినియోగించొద్దన్నారు. ఆలయంలో దర్శనం చేసుకొని, కోళ్లు, మేకలు దూరంగా బలిచ్చి అక్కడే వండుకొని తినాలన్నారు. వన్యప్రాణులు, అడవిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆలయానికి వెళ్లే ప్రధాన గేటు వద్ద భక్తులపై నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. భక్తులు సామరస్యంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నారు. అటవీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని.. వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని మందలించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, కందుకూరు అటవీ అధికారి కమాలుద్దీన్, బీట్ ఆఫీసర్ భాస్కర్రెడ్డి, సామాజిక కార్యకర్త సరస్వతి, టీఆర్ఎస్ నాయకుడు పాండు, అటవీ సిబ్బంది ఉన్నారు.