మర్పల్లి : మనస్తాపం చెంది ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని రావులపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపల్లి గ్రామానికి చెందిన పెండ ఏసయ్య (52) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏసయ్యకు నలుగురు కూతుర్లు ఉండగా ఇద్దరి వివాహాలు జరిగాయి. కొన్ని రోజుల తరువాత రెండో కూతురు భర్త వదిలేయడంతో తల్లిగారి ఇంటి వద్దనే ఉంటుంది. కూతురు కాపురం సవ్యంగా జరుగుతలేదని, మిగతా ఇద్దరు కూతుర్లు పెండ్లికి వచ్చారని, కూలీ పనులు చేస్తూ జీవనం సాగించలేక ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబ సభ్యులు మర్పల్లి దవాఖానకు తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. ఏసయ్య భార్య శ్యామలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటశ్రీను తెలిపారు.