సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): చైనాలో కరోనా పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అక్కడి తీవ్రతను చూస్తుంటే, మిగతా దేశాల్లోనూ వ్యాపించే ప్రమాదం ఉందనే భయం నెలకొంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఐటీ కంపెనీలు మరింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ క్రమంలో జనవరి నుంచి ఐటీ ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందని, 2-3 నెలల కిత్రమే ఐటీ ఉద్యోగులకు ఆయా కంపెనీలు అంతర్గతంగా తమ ఉద్యోగులకు ఈమెయిల్స్ ద్వారా సందేశాలు పంపించాయి. దానికి అనుగుణంగానే డిసెంబర్లో క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల వరకు ఇంటి నుంచి పనిచేసినా, జనవరిలో నుంచి పూర్తిగా ఆఫీసుకు వెళ్లి పని చేయాల్సి ఉండేది. తాజాగా చైనాలో మళ్లీ కరోనా ప్రభావం తీవ్ర రూపం దాల్చడంతో హైదరాబాద్ కేంద్రంగా ఐటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు తమ వినియోగదారులకు సేవలకు పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఉద్యోగులు పనిచేసే విధానంలో పునరాలోచిస్తున్నాయి.
ఆఫీసుకు వచ్చి పనిచేయాలన్న ఒత్తిడి లేదు..
ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు 40-50 శాతం వరకు మాత్రమే ఆఫీసుకు వచ్చి పనిచేస్తుండగా, 20-30 శాతం హైబ్రిడ్ విధానంలో పనిచేస్తున్నారు. ఇక మిగిలిన వారంతా పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం విధానంలోనే పని చేస్తున్నారు. వీరిని సైతం జనవరి నుంచి ఆఫీసుకే రావాలని చెప్పినా, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను పనిచేసే విధానంలో ఎలాంటి ఒత్తిడి చేయడం చేయడం లేదని ఓ ఐటీ ఉద్యోగి తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఇంటి నుంచే ఇంకొన్నాళ్ల పాటు పనిచేసే అవకాశాన్నిచ్చారని ఐటీ ఉద్యోగి తెలిపారు.
తీవ్రతను బట్టి నిర్ణయాలు
కరోనా ప్రభావం ఐటీ కంపెనీల ఉద్యోగులపై ప్రభావం చూపకుండా ఎప్పటికప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా ఐటీ కంపెనీలు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ఐటీ కంపెనీలకు తమ ఉద్యోగుల ఆరోగ్యమే చాలా కీలకం కావడంతో దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని తమ క్లయింట్లకు సేవలను అందిస్తూ ఉంటాయి.
-కృష్ణ యేదుల,కార్యదర్శి, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్