నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెక్ డ్యాంల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. వికారాబాద్ జిల్లాలోని 55 చెరువులు, కుంటలు మత్తడి దుంకుతుండగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా కోట్పల్లి మధ్యతరహా ప్రాజెక్టు, లఖ్నాపూర్ ప్రాజెక్టు, సర్పన్పల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. రంగారెడ్డి జిల్లాలో పలు చెరువులు పూర్తిస్థాయిలో నిండగా, వర్షంధాటికి నాలుగు ఇండ్లు నేలమట్టం కాగా, 16 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. మరో రెండు రోజులు భారీ వర్షం కురిసే అవకాశమున్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
బషీరాబాద్ మండలం క్యాద్గిరా గ్రామ పరిధిలోని కాగ్నా నదిలో మత్తడి దుంకుతున్న చెక్డ్యామ్
పరిగి, జూలై 12 : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా మూడునాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలు చెరువులు మత్తడి దుంకుతుండగా.. మరికొన్ని నిండుకుంటున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రతిరోజూ ఓ మోస్తరు వర్షం కురుస్తున్నది. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసినా ఆ తర్వాత తెరిపి లేకుండా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు చేరుకుంటున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 55 చెరువులు, కుంటలు నీటితో నిండుకొని అలుగు పారుతున్నాయి. జూలై నెల ప్రారంభం నుంచే వర్షాలు అధికంగా కురుస్తుండడంతో ఇప్పటివరకు ఈ నెలలో సాధారణ వర్షపాతం కంటే 177త శాతం అత్యధికంగా వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటుండడంతో జిల్లాలోని దాదాపు సగం చెరువుల వరకు నిండుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెరిపిలేని వర్షాలతో పంటలు పాడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
మూడునాలుగు రోజులుగా కురుస్తున్న తెరిపిలేని వర్షాలతో జిల్లా పరిధిలోని చెరువులు, కుంటలు నీటితో నిండుకుంటున్నాయి. జిల్లా పరిధిలో మొత్తం 1175 చెరువులు, కుంటలున్నాయి. ఇందులో 55 చెరువులు, కుంటలు పూర్తిగా నీటితో నిండిపోయి అలుగు పారుతున్నాయి. 52 చెరువుల ఆయకట్టు 100 ఎకరాల్లోపు ఉండగా, 3 చెరువుల ఆయకట్టు ఒక్కో చెరువు కింద 100 ఎకరాలకు పైగా ఉన్నది. దీంతోపాటు 67 చెరువుల్లో 75 నుంచి 100 శాతం వరకు, 184 చెరువుల్లో 50 నుంచి 75శాతం, 430 చెరువుల్లో 30 నుంచి 50శాతం వరకు, 439 చెరువుల్లో ప్రస్తుతం 30శాతం వరకు నీళ్లు వచ్చి చేరాయి. మరోవైపు రెండుమూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో జిల్లాలో మరిన్ని చెరువులు నిండి అలుగు పారే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. వర్షాలతో చెక్డ్యామ్లన్నీ నిండిపోయి ప్రవహిస్తున్నాయి. జిల్లా పరిధిలోని కోట్పల్లి మధ్యతరహా ప్రాజెక్టు, లఖ్నాపూర్ ప్రాజెక్టు, సర్పన్పల్లి ప్రాజెక్టుల్లోకి కూడా నీరు వచ్చి చేరింది.
గండిపేట చెరువులో తూముల గుండా ప్రవహిస్తున్న వరద నీరు
మంచాలలో వర్షాలకు కూలిన ఇల్లు
తెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పంటలు దెబ్బతినకుండా ఉండేందుకు పంటపొలాల్లో నిలువ ఉన్న నీటిని వెంటనే తీసివేయాలి. దీంతో వేరు భాగంలో గాలి ఆడడంతోపాటు పోషకాలు అందుబాటులోకి వస్తాయి. మొక్కలు చనిపోయే ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు. పత్తికి సంబంధించి వర్షాలు ఆగిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి. లేకపోతే 10 గ్రామాలు పాలిపీడ్ లేదా మల్టికే లేదా యూరియాలో ఒకదాన్ని లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. అధిక తేమ వల్ల నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల సీవోసీ లేదా 200 గ్రాముల సాఫ్ను నేల బాగా తడిచేటట్లు వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
చీడపీడల ఉధృతి పెరుగకుండా లీటరు నీటిలో 2.5 గ్రాముల సాఫ్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందు పిచికారీ చేయాలి. కంది పంటకు వర్షాలు ఆగిన వెంటనే పొలంలో తగినంత తేమ ఉన్నపుడు నేల గుల్ల బారేలా చేసి కలుపు నివారించాలి. ఈ పరిస్థితుల్లో పంటకు పైటాపోరా ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు ఎకరాకు 2 గ్రాముల మెటలాక్సిల్ మందును లీటరు నీటిలో కలిపి నేల బాగా తడిచేలా పిచికారీ చేయాలి. పెసర, మినుము పంటలకు అధిక తేమ వల్ల ఆకుమచ్చ తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మాంకోజెబ్ 2 గ్రాములు లేదా సాఫ్(మాంకోజెబ్+కార్బెండిజమ్) 2 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మక్కజొన్న పంటలకు సంబంధించి వర్షాలు ఆగిన తర్వాత ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల ఎంవోపీ ఎరువులను పైపాటుగా వేయాలి. ఎరువులు వేయడం వీలుకాని పరిస్థితిలో ఎకరాకు 10 గ్రాముల పాలీఫీడ్ లేదా మల్టికేను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
– గోపాల్, వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి