Vikarabad | వికారాబాద్, ఏప్రిల్ 1, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ప్రజా రవాణా వ్యవస్థకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో రహదారుల నిర్మాణానికి, మరమ్మతులకు రూ.వందల కోట్ల నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామ పంచాయతీల వరకు లింక్ రోడ్లను నిర్మించారు. రహదారుల నిర్మాణంతోపాటు వంతెనల నిర్మాణానికి కూడా ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు వెచ్చించింది. గతంలో వానకాలం వస్తే చాలు, వాగులు పొంగిపొర్లి రహదారులు కొట్టుకుపోయిన పరిస్థితి ఉండేది.
అంతేకాకుండా వరదలతో రహదారులు కొట్టుకుపోయి గ్రామాలకు వారం, పది రోజులు రవాణా స్తంభించే దయనీయ పరిస్థితి ఉండేది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వాగులు పొంగిపొర్లి రవాణా స్తంభించే ప్రాంతాలను గుర్తించి సంబంధిత గ్రామాల్లో వంతెనలు నిర్మించి ప్రజల ఇబ్బందులను తీర్చింది. అయితే జిల్లాలో ప్రధానమైన మూసీ, కాగ్నా నదులతోపాటు ఈసీ వాగు ఆయా ప్రాంతాల్లోని ప్రధాన వాగులు, మారుమూల పల్లెల్లోని వాగులపై కూడా రూ.కోట్లు ఖర్చు చేసి బ్రిడ్జిలను నిర్మించడంతో ప్రజలకు కష్టాలు తప్పి రవాణా సాఫీగా జరుగుతుండడం గమనార్హం.
జిల్లాలో గత ఎనిమిదేండ్లుగా వంతెనల నిర్మాణానికిగాను రూ.142 కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం వెచ్చించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మారుమూల పల్లెల్లో సైతం వాగులపై వంతెనలను నిర్మించి గ్రామాల ప్రజల రవాణ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. 2014 నుంచి 2022 వరకు జిల్లాకు 25 వంతెనలను ప్రభుత్వం మంజూరు చేయగా, రూ.123.36కోట్ల నిధులను ఖర్చు చేసింది.
సంబంధిత బ్రిడ్జిల్లో ఇప్పటివరకు దోర్నాల, మర్పల్లి వద్ద రెండు వంతెనల నిర్మాణం పెండింగ్లో ఉండగా, సంబంధిత బ్రిడ్జిల నిర్మాణాన్ని కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా జిల్లాలోని కాగ్నా నది పరివాహక ప్రాంతంలో వంతెనల నిర్మాణానికి అధిక మొత్తంలో నిధులను వెచ్చించారు. కాగ్నానదిపై జీవంగి వద్ద బషీరాబాద్ నుంచి కరన్కట్ వెళ్లే దారిలో రూ.13.40 కోట్లతో వంతెనను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు.
అదేవిధంగా రూ.16.80 కోట్లతో మహబూబ్నగర్-చించోలి రోడ్డులో, రూ.15.30 కోట్లతో వికారాబాద్-తాండూర్ వెళ్లే దారిలో, రూ.12 కోట్లతో శంకర్పల్లి-మర్పల్లి దారిలో, మర్పల్లి-బుదేరా వెళ్లే దారిలో రెండు వంతెనలను, రూ.5.50 కోట్లతో వికారాబాద్-తంగేడ్పల్లి వెళ్లే దారిలో, రూ.6.70 కోట్లతో పరిగి-నంచర్ల రోడ్డులో వంతెనలను, రూ.3.50 కోట్లతో హైదరాబాద్-బీజాపూర్ వెళ్లే దారిలో హైలెవెల్ వంతెనను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు.
తాండూరు-ధారూరు దారిలో రూ.4.70 కోట్లతో, చిట్టంపల్లి-లాల్పహాడ్ మధ్య రూ.5.25 కోట్లతో, తాండూరు సిల్వర్ రోడ్డులో రూ.3 కోట్లతో, రూ.8.90 కోట్లతో తాండూరు-కోట్పల్లి రోడ్డులో ప్రధానంగా వంతెనలను నిర్మించారు. జిల్లాకు కొత్తగా ఆరు వంతెనల నిర్మాణానికిగాను ప్రభుత్వం రూ.18.78 కోట్ల నిధులిచ్చింది. జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గానికి 3, పరిగి నియోజకవర్గానికి 2 వంతెనలు, తాండూరు నియోజకవర్గానికి ఒక వంతెనను ప్రభుత్వం మంజూరు చేసింది.
బ్రిడ్జి నిర్మాణంతో రెండు తండాల సమస్య పరిష్కారం
కొడంగల్, ఏప్రిల్ 1 : మండలంలోని పోచమ్మతండా పంచాయతీ పరిధిలోని పోచమ్మతండా-మైసమ్మ తండాల మధ్య వాగుతో రెండు తండాలకు ప్రతి వర్షాకాలం ఇబ్బందులు తప్పేవికావు. గత రెండు సంవత్సరాల క్రితం పోచమ్మతండాలో ఓ గిరిజన వృద్ధురాలు మృతి చెందితే ఖననం చేసేందుకు రెండు రోజులు వేచిఉండాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందోనని ఎదురు చూసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వాగు నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు కావడంతో ప్రస్తుతం వంతెన నిర్మాణం పూర్తి చేశారు. దీంతో తండా వాసులు ప్రయాణం సాఫీగా కొనసాగిస్తున్నారు.
ఇదే తరహాల్లో మున్సిపల్ పరిధిలోని కొండారెడ్డిపల్లికి వెళ్లే దారిలో వాగు పారుతుండేది. దాంతో పాటు రోడ్డు సౌకర్యాలు కూడా ఉండేవి కావు. తండాకు రూ.1.70లక్షలు మంజూరు కావడంతో రోడ్డుతో పాటు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ప్రస్తుతం గ్రామస్తులు ఇబ్బందుల్లేకుండా రాకపోకలు కొనసాగిస్తున్నారు. మండలంలోని ఖాజాఅహ్మద్పల్లిలో రహదారి మధ్యలో వాగుపై వంతెన శిథిలావస్థలకు చేరుకోవడంతో రూ.40లక్షల నిధుల మంజూరుతో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.