అత్యాధునిక హంగులు, అద్భుత నిర్మాణంతో కొంగరకలాన్లోని రంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ రూపుదిద్దుకున్నది. మార్చి 31వ తేదీ నాటికి పనులు పూర్తి చేసి అందించాలన్న రాష్ట్ర సర్కార్ ఆదేశాల మేరకు పనులు చకచకా సాగుతున్నాయి. రెండంతస్తుల భవనంలో సువిశాలమైన గదులను నిర్మించగా, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫర్నిచర్ వంటి చిన్నచిన్న పనులూ పూర్తయ్యాయి. జిల్లాకు సంబంధించిన అన్ని విభాగాల కార్యాలయాలూ ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేశారు. కలెక్టరేట్కు 40 ఎకరాల స్థలాన్ని కేటాయించి, రూ.32కోట్లతో భవనాన్ని నిర్మించారు. కార్యాలయం గేటు మొదలుకుని లోపలి వరకు డబుల్ రోడ్లు, చుట్టూ బీటీ రోడ్లను నిర్మించారు. కార్యాలయం బయట మొక్కలను నాటడంతో పాటు లోపలి భాగంలో పచ్చదనం ఉట్టిపడేలా తయారు చేస్తున్నారు. కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణంతో కొంగరకలాన్ ప్రాంతం కొత్తకళను సంతరించుకున్నది.
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 27: రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కలెక్టర్ కార్యాలయంతోపాటు జిల్లాలోని మిగతా ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఈ భవనాన్ని నిర్మించారు. మార్చి 31లోపు పనులను పూర్తిచేసి భవనాన్ని అప్పగించాలని ఇప్పటికే ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఆదేశించింది. ఉగాది పండుగ లోపు నూతన కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అనువుగా ఔటర్రింగ్రోడ్డు పక్కన కొంగరకలాన్ గ్రామ సమీపంలోని సర్వేనంబర్ 300లో 40 ఎకరాల్లో నూతన కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. రూ.32 కోట్లతో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే భవన నిర్మాణంతోపాటు ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫర్నిచర్ వంటి పనులు కూడా పూర్తయ్యాయి. ఫ్లోరింగ్, అంతర్గత రోడ్లు కూడా పూర్తికావొచ్చాయి. నూతన కలెక్టరేట్ను రెండంతస్తుల్లో అత్యాధునిక హంగులతో నిర్మించారు. సెంట్రల్ ఏసీని కల్పించారు. కింది భవంతిలో వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక హాల్ను ఏర్పాటు చేశారు. మార్చి 31లోగా రోడ్లు, భవనాల శాఖకు అప్పగించేందుకు కాంట్రాక్టర్లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. గేటు నుంచి కార్యాలయం వరకు డబుల్ రోడ్లు, కార్యాలయం చుట్టూ బీటీ రోడ్లను నిర్మించారు. కార్యాలయ భవనం మధ్యలో అశోక చిహ్నాన్ని కూడా ఏర్పాటుచేశారు. కలెక్టరేట్ లోపలి భాగంలో పచ్చదనం ఉట్టిపడేలా సుందరీకరిస్తున్నారు. సిబ్బంది కోసం ప్రత్యేక క్యాబిన్లను కూడా ఏర్పాటుచేశారు.
ఇబ్రహీంపట్నం సమీపంలోని కొంగరకలాన్లో నూతన కలెక్టరేట్ నిర్మాణంతో ఈ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకున్నది. ఇప్పటికే ఔటర్రింగ్ రోడ్డు రావటంతో ఈ ప్రాంతం లో రియల్ఎస్టేట్ సంస్థలు పెద్ద ఎత్తున వెంచర్లను ఏర్పాటు చేశాయి. కలెక్టరేట్ నిర్మాణంతో ఈ ప్రాం తంలోని భూముల ధరలు భారీగా పెరిగాయి. ఓఆర్ఆర్ చుట్టూ అత్యాధునిక హంగులతో కూడిన విల్లా లు, అపార్ట్మెంట్లు వెలిశా యి. దీంతో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరందు కున్నది. త్వరలోనే కలెక్టరేట్ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ల ధరలు అధికంగా పెరిగే అవకాశాలున్నాయి.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రస్తుతం నగరంలోని లక్డికాపూల్లో ఉంది. జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు వివిధ పనుల నిమిత్తం అక్కడికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కలెక్టరేట్ ఎదుట గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వా త పాలనాసౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కొంగరకలాన్లో కలెక్టరేట్ నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే దాదాపుగా పనులు పూర్తి కాగా.. ఉగాది పండుగ నాటికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పా ట్లు జరుగుతున్నాయి. నగరానికి దగ్గరలో ఉండటంతో ఉద్యోగులు కూడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నూతన కలెక్టరేట్కు సొంత వాహనాల్లో రాకపోకలు సాగించొచ్చు. కలెక్టరేట్ భవనం ప్రారంభం తర్వాత ఇబ్రహీంపట్నంతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు బస్సులను నడిపించే ఆలోచనలో ఆర్టీసీ ఉంది.
రంగారెడ్డి నూతన కలెక్టరేట్ను కొంగరకలాన్ గ్రామ సమీపంలోని సర్వేనంబర్ 300లో 40 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. గతంలో ఈ భూమి ని రైస్హబ్ కోసం ప్రభుత్వం కేటాయించిం ది. కానీ.. ఇక్కడ రైస్మిల్లర్లు నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రాకపోవడంతో వారి కేటాయింపులను ప్రభుత్వం రద్దుచేసి కలెక్టరేట్ నిర్మాణానికి భూమిని కేటాయించింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్నగర్తోపాటు శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ఈ కలెక్టరేట్ అందుబాటు లో ఉండనున్నది. అంతేకాకుండా ఈ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఓఆర్ఆర్ మీదుగా వచ్చి ప్యాబ్సిటీ వద్ద దిగిన వెంటనే కలెక్టరేట్కు వెళ్లేలా రోడ్డును కూడా నిర్మించారు. 40 ఎకరాల్లో సువిశాలమైన గదులతో కలెక్టరేట్ను నిర్మించారు. అంతర్జాతీయ విమానశ్రయానికీ కలెక్టరేట్ అతి సమీపంలో ఉంటుంది.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నిర్మా ణం కొంగరకలాన్లో అత్యాధునిక హంగులతో పూర్తైంది. మార్చి 31లోపు పనులను పూర్తిచేసి భవనాన్ని అప్పగించాలని ఇప్పటికే ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఆదేశించింది. ఉగాది పండుగ లోపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కలెక్టరేట్ ప్రారంభమైతే ప్రజలకు పాలన మరింత చేరువవుతుంది. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండనున్నాయి.
-మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే