వికారాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా పేదలకు ఇచ్చిన హామీలు మాత్రం అమలుకు నోచుకోవడంలేదు. కేవలం ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రస్తావించడం మినహా మిగతా వాటి ఊసేత్తడం లేదు. ఆసరా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులను పెంచుతామని ఇచ్చిన హామీని మర్చిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకిచ్చే రూ.2016 పింఛన్ డబ్బులను రూ.4000, దివ్యాంగులకు ఇచ్చే రూ.4016 పింఛన్ను రూ. 6000 పెంచుతామని చెప్పగా వారి మాటలు నమ్మి ఓటేసి గెలిపించిన ఆసరా పింఛన్దారులు పింఛన్ల పెంపు ఎప్పుడో అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆరు గ్యా రెంటీలంటూ ప్రచారం చేస్తున్నా వాటి అమలుకు తెల్లరేషన్ కార్డును తప్పనిసరి చేయడంతో పేదలు ఎంతోమంది ఈ పథకాలకు అనర్హులయ్యే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా పింఛన్ డబ్బులను పెంచుతామని హామీ ఇచ్చినా ఇంకా పాత పింఛన్లే పంపిణీ చేస్తున్నది. అవికూడా 20 రోజులు ఆలస్యంగా లబ్ధిదారులకు అందు తున్నా యి. అదే బీఆర్ఎస్ హయాంలో ప్రతినెలా 20వ తేదీలోగా ఠంచన్గా అందేవి.
ప్రతినెలా పింఛన్ల పంపిణీలో జాప్యం..
ఆసరా పింఛన్తోనే బతుకు బండిని లాగిస్తున్న పండుటాకులు, దివ్యాంగులకు కాం గ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే పింఛన్ల పంపిణీలో జాప్యం చేస్తున్నది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లోని లబ్ధిదారు లకు పింఛన్ డబ్బుల పంపిణీ ప్రతినెలా 29 లేదా 30 తేదీన ప్రారంభమై వారం రోజుల్లో పంపిణీని పూర్తి చేస్తుండగా.. కొడంగల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులు మాత్రం పింఛన్ డబ్బుల కోసం మొదటి వారం పూర్తయ్యే వరకూ నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ హయాంలో ప్రతినెలా 20వ తేదీలోగా లబ్ధిదారులకు అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే పింఛన్ల పంపిణీ ఆలస్యం అవుతుండడంతో పింఛన్దారుల్లో అయోమయం నెలకొన్నది. ప్రతినెలా పింఛన్ డబ్బుల కోసం నిరీక్షించాల్సి వస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రతినెలా పింఛన్ డబ్బుల పంపిణీలో జాప్యం జరుగుతుండడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొడంగల్ సెగ్మెంట్కు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఆసరా పింఛన్ల నిమిత్తం నిధులు మంజూరవుతుండగా.. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు రంగారెడ్డి జిల్లా నుంచి వస్తున్నాయి. జిల్లాలో 98,793 మంది పింఛన్దారులు ఉండగా.. ప్రతి నెలా రూ. 24.38 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.
దేశంలో ఎక్కడాలేని విధంగా పింఛన్లు పెంచిన బీఆర్ఎస్..
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమల్లోకి తెచ్చి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అండగా నిలవడంతోపాటు దేశంలో ఎక్కడాలేని విధంగా వారికి పింఛన్ డబ్బులను పెంచింది. మొదటిసారి అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులు తదితరులకిచ్చే రూ.200 పింఛన్ను రూ.1000కి, దివ్యాంగులకు ఇచ్చే రూ.500 పింఛన్ను రూ.1500లకు.. రెండోసారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే రూ. 1,000 నుంచి రూ.2016, దివ్యాంగుల పింఛన్ను రూ.1500ల నుంచి రూ. 30 16కు.. దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు గతేడాది జూన్లో దివ్యాంగుల పింఛన్ ను రూ.4016లకు పెంచి పేదల ప్రభుత్వంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది. జిల్లా లో పింఛన్ల నిమిత్తం రూ.1100 కోట్లకుపైగా ఖర్చు చేసింది. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో పింఛన్ల నిమిత్తం అప్పటి ప్రభుత్వాలు నెలకు కేవలం రూ.2 కోట్లు ఖర్చు చేయగా…బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతి నెలా రూ.12కోట్ల మేర, రెండోసారి పగ్గాలు చేపట్టగానే పింఛన్ డబ్బులు రెట్టింపు కావడంతో నెలకు రూ.26 కోట్ల మేర ఖర్చు చేసింది.