వికారాబాద్/కోట్పల్లి : 3 గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ పార్టీ వద్దు.. 3 పంటలు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వమే మాకు కావాలని రైతులు కోరుకుంటున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం కోట్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామ రైతువేదిక, మర్పల్లి మండలం కల్కొడలోని రైతువేదికల్లో జరిగిన రైతు సమావేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 60 ఏండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతుల అభ్యున్నతికి కృషి చేయలేదని మండిపడ్డారు. తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని.. వ్యవసాయం పండుగలా మారి దేశానికే అన్నం పెట్టే స్థాయికి మన అన్నదాత ఎదిగినట్లు తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్షకులపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రల ను ఎండగట్టారు. గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగా అనగా .. సీఎం కేసీఆర్ పండుగలా మార్చారని.. అందువల్ల ఆయనకు రైతులందరూ రుణపడి ఉండాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి తదితర పథకాలు రద్దు అవుతాయని.. అందువల్ల రైతు లు, ప్రజలు అప్రమత్తంగా ఉండి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, కోట్పల్లి, మర్పల్లి ఎంపీపీలు శ్రీనివాస్రెడ్డి, లలిత, సర్పంచ్లు అనితారెడ్డి, శివకుమార్, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మండలాల అధ్యక్షులు అనిల్, శ్రీకాంత్రెడ్డి, సర్పంచులు సంఘం మండలాధ్యక్షుడు వెంకటేశ్యాదవ్, రైతుబంధు సమితి మండలాల అధ్యక్షులు సత్యం, నాయబ్గౌడ్, రాజు, బలవంత్, అనంతయ్య, ఆయా గ్రామాల సర్పంచు లు, నాయకులు, కార్యకర్త్తలు, రైతులు పాల్గొన్నారు.