ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 23 : తెలంగాణ సాధించడంతో పాటు అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన బీఆర్ఎస్ పార్టీకి తప్పా.. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లడిగే నైతిక హక్కులేదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్తో కలిసి ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కానీ హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఆ హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ను గెలిపించకపోతే హామీలు అమలు కావని, ఆ పార్టీ నాయకులే ఒప్పుకుంటున్నారన్నారు. రాముడి పేరు చెప్పుకుని బీజేపీ లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తుందన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి దేవాలయంను ఆధునీకరించి ప్రపంచ పటంలో నిలిపిందన్నారు. అలాగే, భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న పలు రహదారులను ఆధునీకరించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ మాట్లాడుతూ భువనగిరి ప్రజలు ఎంతో చైతన్యవంతులని, పోరాట పటిమ కలిగిన వారని అన్నారు. అలాంటి భువనగిరి పార్లమెంట్ పరిధిలో తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో స్థానికుడైన తనను పార్టీలకతీతంగా ఓట్లు వేయాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే బడుగు, బలహీన వర్గాలు, బీసీలకు పెద్దపీట వేశారన్నారు. భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ అధినేత కేసీఆర్ తనకు అవకాశం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గ రాములు, రమేశ్, రమేశ్గౌడ్, కిషన్గౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, దామోదర్, కల్యాణ్నాయక్, జంగయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.