సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ అంశంలో అధికారుల్లో అయోమయం నెలకొన్నది. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన..క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలంటే నిపుణులైన ప్లానింగ్ సిబ్బంది చాలా కీలకం. ప్రస్తుతం హెచ్ఎండీఏతో పాటు జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లో ఆ స్థాయిలో సిబ్బంది అందుబాటులో లేరని, అలాంటి పరిస్థితుల్లో లక్షలాది దరఖాస్తులను మార్చి 31 వరకు పూర్తి చేయడం అసాధ్యమనే అభిప్రాయాన్ని ప్లానింగ్ విభాగం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
లక్షల్లో ఉన్న అర్జీలను దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి.. ప్రొసీడింగ్స్ ఇవ్వాలంటే 6-8 నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విషయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సాధ్యాసాధ్యాలపై సమీక్ష చేయలేదు. పైగా మార్చి నెలాఖరులోగా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జారీ చేశారు. అప్పటి నుంచి పట్టణ ప్రణాళికా విభాగం (టౌన్ప్లానింగ్) అధికారులు కసరత్తు మొదలు పెట్టినా.. నిర్ణీత గడువులోగా అసాధ్యమని పేర్కొంటున్నారు.
7 జిల్లాల పరిధిలో విస్తరించిన ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో 47 మున్సిపాలిటీలను మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లోంచి వచ్చిన దరఖాస్తులే 3,44,726 వరకు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు కేవలం 50,025 అర్జీలను హెచ్ఎండీఏ అధికారులు జోన్ల వారీగా పరిశీలించారు. మిగతా వాటిని పరిశీలన చేసి క్రమబద్ధీకరించే పనిని మొదలు పెట్టినా, ప్రస్తుతం ఉన్న సిబ్బందితో ఎంత వేగంగా చేసినా సాధ్యం కాదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు సుమారు 25 లక్షల వరకు ఉన్నాయి. ఈ దరఖాస్తులను పూర్తిగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు అప్పగించకుండా శివారు ప్రాంతాల్లో ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 వరకు ఉన్న మున్సిపాలటీలకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ బాధ్యతలను అప్పగించారు. వీటి పరిధిలోనూ 2-3 లక్షలపైనే ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇలా అన్ని చోట్ల లక్షల్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించడం, క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయడమంటే ఏవిధంగా చూసినా అసాధ్యమనే చెబుతున్నారు. పైగా పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో అధికారులు వాటి విధుల్లో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఎల్ఆర్ఎస్’ ప్రక్రియ పూర్తి చేయడం అసాధ్యమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.