రంగారెడ్డి, జనవరి 20(నమస్తే తెలంగాణ) : వేసవికి ముందే జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. మరోపక్క రోజురోజుకూ భూగర్భజల మట్టం పాతాళానికి పడిపోతున్నది.
బోరు బావులు బోరుమంటుండడంతో ఈసారి తాగునీటికి కటకట ఏర్పడనున్నది. గత ఏడాది డిసెంబర్తో పోలిస్తే ప్రస్తుత డిసెంబర్లో భూగర్భ జలాలు 2.74 మీటర్ల లోతుల్లోకి వెళ్లాయి. వ్యవసాయానికి సైతం నీటి గండం పొంచి ఉన్నది. సాగు నీటి కొరత దృష్ట్యా జిల్లాలో యాసంగి సాగు ఇప్పటివరకు 11 వేల ఎకరాలు కూడా దాటలేదు.
భూగర్భజలాలు అడుగంటిపోతుండడం రైతులను ఆందోళన కలిగిస్తున్నది. భూగర్భజల శాఖ అధికారులు ఫ్యూజోమీటర్ ఆధారంగా విడుదల చేసిన నివేదికలు రానున్న రోజుల్లో పొంచి ఉన్న నీటి ఇబ్బందులకు సంకేతాలిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో జిల్లాలో భూగర్భజలాలు 5.94 మీటర్ల లోతులోనే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత డిసెంబర్లో 8.68 మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలాలు వెళ్లిపోయాయి.
గతంతో పోలిస్తే ఈసారి 2.74 మీటర్ల లోతుల్లోకి నీటి మట్టం పడిపోయింది. శేరిలింగంపల్లిలో 26.42 మీటర్ల లోతుల్లో బోరు వేస్తే గానీ.. భూగర్భ జలాలు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. కేశంపేట మండలంలో మాత్రం 3.98 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉండడం ఊరట కలిగిస్తున్నది. డిసెంబర్ నెలలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం.. వచ్చేది వేసవి కాలం కావడంతో భవిష్యత్తును తల్చుకుని ప్రజానీకం ఆందోళన చెందుతున్నది.
ఓ వైపు నీటి వనరుల్లో జలాలు.. మరోవైపు భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు యాసంగి సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. జిల్లాలో చాలా వరకు బోరు, బావుల ద్వారానే వ్యవసాయం సాగుతున్నది. రానున్న రోజుల్లో బోర్లు ఎండిపోతే పరిస్థితి ఏంటన్న మీమాంసలో రైతులున్నారు. దీనికితోడు రైతులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రైతు బంధు అందలేదు. ఎకరా, రెండెకరాల్లో ఉన్న రైతులకు మాత్రమే వచ్చాయి.
పెట్టుబడి పెట్టి పంటలు వేస్తే.. చేతికి వస్తాయా? గిట్టుబాటు అవుతుందో లేదో? అన్న ఆందోళనలో జిల్లా రైతులున్నారు. ఈ పరిస్థితుల్లో పంటలను సాగు చేసే సాహసం చేయలేకపోతున్నారు. యాసంగి సాగు 80 వేల ఎకరాల్లో ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసినప్పటికీ.. ఇప్పటివరకు జిల్లాలో వివిధ రకాల పంటలు 10,350 ఎకరాల్లోనే సాగయ్యాయి. 50 వేలకు పైగా ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా ఉంది. అయితే 11,360 ఎకరాల్లో నాటేందుకు నారు మడి సిద్ధంగా ఉండగా.. ఇప్పటివరకు కేవలం 669 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి.