బొంరాస్పేట, జనవరి 18 : మండలంలోని ప్రధాన కూడళ్లలో సూచిక బోర్డులు లేక ఏ రోడ్డు ఎటు పోతుందో తెలియక ప్రయాణికులు తికమక పడుతున్నారు. కూడళ్లు, మలుపుల వద్ద ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రహదారుల శాఖ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. కూడళ్లలో ఉన్న రహదారి ఎక్కడి వరకు వెళున్నది, ఎంత దూరం ఉందనే సమాచారాన్ని తెలుపుతూ సూచిక బోర్డులు ఏర్పాటు చేసే వారు. దీంతో ప్రయాణికులు ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. కూడళ్లలో సూచిక బోర్డులు లేక కొత్తగా వచ్చే ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
అలాగే రోడ్డు మలుపుల వద్ద కూడా ప్రమాద తీవ్రతను తెలుపుతూ బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. రాత్రి సమయంలో వెళ్లే వాహనదారులకు కూడా రోడ్డు మలుపులు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలంటున్నారు. వీటి ఏర్పాటుతో రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.
మండలంలోని బొంరాస్పేట నుంచి బురాన్పూర్ వెళ్లే రోడ్డులో జోగుకుంట సమీపంలో ఉన్న మలుపు, బొంరాస్పేట నుంచి తాండూరు వెళ్లే రోడ్డులో నమాజ్గుట్ట వద్ద ఉన్న మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. జోగుకుంట మలుపు వద్ద ఇటీవలే కారు.. బైకు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గతంలో కూడా ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగాయి. మండలంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కూడళ్లలో గ్రామాల సమాచారాన్ని తెలిపే సూచిక బోర్డులతో పాటు, రోడ్డు మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.