రంగారెడ్డి, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : రీ పోలింగ్కు ఆస్కారం లేకుండా ఎన్నికల విధులను పూర్తి అవగాహనతో, ఎలాంటి పొరపాట్లు జరుగకుండా సజావుగా నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో కలెక్టర్ శశాంక అధ్యక్షతన జిల్లా, నియోజకవర్గస్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాస్టర్ ట్రైనర్లు ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
నియోజకవర్గస్థాయిలో ప్రిసైడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చేటప్పుడు వారి సందేహాలను నివృత్తి చేయాలని, డీఎల్ఎంటీ, ఏఎల్ఎంటీలు కూడా శిక్షణలోని ప్రతి అంశంపై పట్టు కలిగి ఉండాలన్నారు. శిక్షణకు హాజరయ్యే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ద్వారా హాజరు తీసుకోవాలని సూచించారు. అధికారులకు సరైన శిక్షణ ఇవ్వకపోతే తప్పులు జరిగే అవకాశం ఉంటుందని, మాక్ పోల్ నిర్వహణ, ఈవీఎం ఆపరేట్ చేయడం, ప్రిసైడింగ్ అధికారుల విధులు, బాధ్యతలను, ప్రీ పోల్, పోలింగ్ తర్వాత చేయాల్సిన పనులను విడమర్చి చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్వో సంగీత, డీఈవో సుశీందర్రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.