వికారాబాద్, ఏప్రిల్ 15 : జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను లక్ష్యం మేరకు లేబర్ సమీకరణ చేస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు పక్కా ప్రణాళికతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్యను పెంచుతూ పనులు చేయించాలని, ప్రతి రోజూ పనులు పూర్తయిన వాటికి తప్పనిసరిగా ఎఫ్టీవో జనరేట్ చేయాలని తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున అనారోగ్యంగా ఉన్న లేబర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పనిలోకి తీసుకోవద్దన్నారు. లేబర్ ఉదయమే వచ్చి పనులు చేసి మధ్యాహ్నం వరకు ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, లేబర్ పనిచేసే చోట తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
గ్రామపంచాయతీ పనుల్లో లేబర్ సమీకరణ చేస్తూ పద్ధతి ప్రకారం పనులు చేపడితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. గ్రామపంచాయతీ, పట్టణ పరిధిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా తాగునీటి సమస్య ఏర్పడితే అధికారులు వెంటనే స్పందించి 24 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు.
ఎంపీడీవోలు, కమిషనర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వారితో మాట్లాడి స్కూళ్లలో మంజూరై పెండింగ్లో ఉన్న పనులను మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి స్కూల్లో పిల్లలకు ఉపయోగపడే పనులు జరగాలని, స్కూల్స్లో పెండింగ్ పనులు నిర్వహించేందుకు స్పెషల్ అధికారిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్లో డీఆర్డీఏ శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డీఈవో, ఎంపీడీవోలు, ఏపీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.