‘పల్లెటూరి ప్రపంచం చాలా చిన్నది. అక్కడి మనుషుల్లో తెలియని అమాయకత్వం కనిపిస్తుంది. చిన్న విషయాల కోసం పెద్ద గొడవలు జరుగుతాయి. తర్వాత వెంటనే కలిసిపోతారు. పల్లె ప్రజల జీవితాలను పరిశీలిస్తే మంచి కథల్ని రాసుకోవచ్చు. అలాంటి మనసుకు హత్తుకునే కథే ఈ సినిమా’ అన్నారు దర్శకుడు ఉదయ్ చౌహాన్. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ‘పల్లెబురుసు’ చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘బలగం’ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విలేజ్ డ్రామాను అన్నపూర్ణ స్టూడియోస్ తెరకెక్కించింది. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం దర్శకుడు ఉదయ్ చౌహాన్ విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
మాది పాలమూరు జిల్లా. సినిమాల మీద వ్యామోహంతో మాస్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ పూర్తి చేశాను. అనంతరం పూణే సింబాయసిస్ యూనివర్సిటీలో ఫిల్మ్ కోర్స్ చేశాను. అక్కడే స్క్రీన్ప్లే, దర్శకత్వం గురించి నేర్చుకున్నా. ఆ తర్వాత ముంబయిలో యాడ్ ఫిల్మ్స్కు అసిస్టెంట్గా పనిచేశాను. నేను పాలమూరులో పుట్టిపెరగడంతో అక్కడి పల్లెల్లో జరిగే సంఘటనలు, మనుషులను జాగ్రత్తగా పరిశీలించేవాడిని. ఆ గ్రామీణ జీవితాల స్ఫూర్తితోనే ఈ కథ రాసుకున్నా.
పళ్లబురుసు (టూత్బ్రెష్) కొనివ్వలేదని ఓ తండ్రి.. కొడుకుపై కోర్టులో వేసిన కేసు నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అయితే పళ్లబురుసు అన్నది ఓ అంశం మాత్రమే. ఈ కథలో చాలా పొరలు ఉంటాయి. హృదయాన్ని కదిలించే డ్రామాతో పాటు చక్కటి వినోదం ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు మనకు ఇష్టమైన పల్లెకు వెళ్లి వచ్చిన అనుభూతికిలోనవుతాము.
సిద్ధిపేట సమీపంలోని లచ్చపేటలో ఈ సినిమా షూటింగ్ చేశాం. అక్కడి లోకేషన్లు చాలా సహజంగా అనిపించాయి. కథరీత్యా బాగా కుదిరాయి. నాగార్జునగారు ఈ సినిమా చూసి హార్ట్టచింగ్గా ఉందన్నారు. సంభాషణలు కూడా తెలంగాణ పల్లెయాసలో అద్భుతంగా కుదిరాయని మెచ్చుకున్నారు. కథ రాసుకున్నప్పుడే ‘పళ్లబురుసు’ అనే టైటిల్ అనుకున్నా. తెలంగాణ గ్రామీణులు ఇప్పటికీ ఉపయోగించే ఈ పదం చాలా మందికి రీచ్ అవుతుందని భావించాను. సత్యజిత్ రే, అదూర్ గోపాలకృష్ణన్, రాజమౌళి నా ఫేవరేట్ డైరెక్టర్స్.