(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడిపోతున్నారు. ముఖ్యంగా దేశీయ విమానాల్లో తరుచూ చోటు చేసుకొంటున్న సాంకేతిక సమస్యలు, పైలట్ల తీరు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గడిచిన వారం వ్యవధిలోనే ఇలాంటి నాలుగైదు ఘటనలు వెలుగుచూడటం విమానాల్లో భద్రతను ప్రశ్నిస్తున్నాయి.
11.08.2026: కోల్కతా నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిలయ్యింది. దీంతో పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను అప్రమత్తం చేశారు. రన్వే క్లియర్గా ఉండటంతో ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో 224 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు.
11.08.2026: ఢిల్లీ నుంచి పుణెకు బయల్దేరాల్సిన స్పైస్జెట్ విమానం ఆలస్యమైంది. 150 మంది ప్రయాణికులు విమానంలోకి ఎక్కిన తర్వాత ఏసీలు పని చేయలేదు. ఊపిరాడక, మంట, చెమటతో ఏకంగా తొమ్మిది గంటలపాటు ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. విమానంలో గర్భిణులు, పిల్లలు ఉన్నారు.
11.08.2026: ఢిల్లీ నుంచి విజయవాడకు వస్తున్న ఎయిరిండియా విమానం కాక్పిట్ అద్దంలో సమస్యను పైలట్ గురించాడు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్కు మళ్లించారు. ఆ తర్వాత సమస్య పరిష్కారమయ్యిందనుకొని విజయవాడలో ల్యాండ్ చేశారు. కానీ, సమస్య అలాగే ఉండటంతో విజయవాడ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సిన ఆ సర్వీసును రద్దు చేశారు.
04.08.2026: థాయిలాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా 300 అడుగులు కిందికి దిగడంతో 20 మంది వరకూ ప్రయాణికులు గాయపడ్డారు. ట్రిపుల్ హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్యూర్తో పాటు పైలట్ గంజాయి సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది.

ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ దేశ, విదేశాలకు నడుపుతున్న దేశీయ విమాన సర్వీసుల్లో 352 సాంకేతిక లోపాలు గుర్తించామని కేంద్రం ఇటీవల పార్లమెంట్కు వెల్లడించింది. ఆకాశ ఎయిర్లో అత్యధికంగా 152 లోపాలను గుర్తిస్తే, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో 53, ఇండిగోలో 47, ఎయిరిండియాలో 46, స్టార్ ఎయిర్లో 29, స్పైస్జెట్లో తొమ్మిది, ైఫ్లై91లో తొమ్మిది, ఇండియా వన్ ఎయిర్లో ఐదు, బ్లూడార్ట్లో రెండు సాంకేతిక లోపాలను గుర్తించినట్టు పేర్కొంది. విమాన సర్వీసులకు సంబంధించి గత మూడేండ్లలో మొత్తంగా 2,420 సాంకేతిక లోపాలను గుర్తించినట్టు కేంద్రం వివరించింది.