వికారాబాద్, మార్చి 18 : పదో తరగతి పరీక్షలను నిర్భయంగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ వికారాబాద్లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ప్రతి రూమ్కు వెళ్లి పరిశీలిస్తూ పరీక్షలు రాసే విద్యార్థులు పక్క వారితో మాట్లాడరాదని, మాస్ కాపీయింగ్ జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో 240 మంది విద్యార్థులకు 239 మంది హాజరయ్యారని చీఫ్ సూపరింటెండెంట్ కలెక్టర్కు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాత లోనికి పంపాలని, సెల్ఫోన్ను అనుమతించవద్దన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట చీఫ్ సూపరింటెండెంట్ సునీత, అబ్జర్వర్ వినయకుమార్, సంబంధిత అధికారులు ఉన్నారు.
ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచి 100 శాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు సీసీ రోడ్లు, లేబర్ మొబిలైజేషన్కు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. గ్రామ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ వ్యవస్థను బలోపేతం చేస్తూ కూలీల సంఖ్యను పెంచుతూ పనులు 100 శాతం పనులు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో జాబ్ కార్డు ఉన్నవారందరికీ పని కల్పిస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
అంచనా ప్రకారం కూలీల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. గ్రామ పరిధిలో ఉండే చిన్న చిన్న సమస్యలను మండల అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఇప్పటివరకు పూర్తయిన వాటికి ఎఫ్టీవో తప్పనిసరిగా జనరేట్ చేయాలన్నారు. ఏ మండలంలో ఏ తేదీ వరకు ఎఫ్టీవో జనరేట్ అయినది, ఇంకా చేయాల్సినవి ఎన్ని ఉన్నాయో టీఏలందరూ చెక్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్లో డీఆర్డీఏ శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి సుధారాణి పాల్గొన్నారు.