వామ్మో చలి.. రోజంతా చలే.. చలి పులి పంజా విసురుతున్నది. వేకువజాము మొదలు దట్టమైన పొగమంచు కమ్మేస్తూ ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. సెద్దర్లు కప్పుకున్నా..స్వెటర్లు వేసుకున్నా.. మంకీ క్యాపు పెట్టుకున్నా.. మఫ్లర్లు కట్టుకున్నా.. ప్రజలు గజగజ వణికిపోతున్నారు. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు.
కంది పొరుక.. తాటి కమ్మలు, కట్టెలు, చెత్తతో మంట పెట్టుకుని జనం చలికాగుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13.1 డిగ్రీలకు పడిపోయింది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, పనులకు వెళ్లే జనం అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రత పెరుగుతుండడంతో ఫుట్పాత్ల వెంట అమ్మే స్వెటర్లు, జర్కిన్లు, మంకీ టోపీలకు గిరాకీ పెరిగింది.
– రంగారెడ్డి, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : చలి జిల్లా ప్రజలను వణికిస్తున్నది. వాతావరణంలో సంభవించిన పెను మార్పుల కారణంగా పదేండ్లలో ఎన్న డూ లేని విధంగా చలిపులి పంజా విసురుతున్నది. పగటి ఉష్ణోగ్రత లు కనిష్ఠంగా 13.1 డిగ్రీలు కాగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్ దాటడం లేదు. రాత్రివేళ 18-19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దీనికితోడు చల్లని గాలులు వీస్తుండడంతో జనం రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 9 గంటల వరకు కూడా దట్టమైన పొగమంచు కమ్మేసి ఉంటుండటంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగు లు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు, కూలీలు అవస్థలు పడుతున్నా రు. మరో నెల రోజు ల వరకు చలి తీవ్రత ఇలాగే ఉండే అవకా శం ఉన్నందున ఆరో గ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
కొన్ని రోజులుగా సూర్యుడి జాడ లేక రోజంతా వాతావరణం చల్లగానే ఉంటున్నది. తెల్లవారు జా మున కురుస్తున్న మంచుతో చలి తీవ్రత మరింత ఎక్కువై ప్రజలకు వణుకు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో జనసంచారం సైతం తక్కువగా ఉంటున్నది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, విధుల నిమి త్తం దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న ఉద్యోగులు తీవ్ర చలిలోనూ వెళ్లాల్సి రావడంతో అవస్థ లు పడుతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచే మొదలవుతున్న చలి తీవ్రత వ్యాపారంపై కూడా ప్రభావం చూపుతున్నది. పట్టణాల్లో వ్యాపారులు రాత్రి 8 గంటలకే దుకాణాలను మూసి వేస్తున్నా రు. చిరు వ్యాపారులు రాత్రి 7 గంటలకే వ్యాపారాన్ని ముగించుకుని ఇంటి బాట పడుతున్నారు.
చలి కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్న వారు చలి ప్రభావానికి లోనుకాకుండా ఉండాలంటున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, జ్వరం, దగ్గు, దమ్ములాంటి సమస్యలు ఉన్నవారు వెచ్చని వాతావరణంలో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఎం తైన ఉంది. అలాగే వృద్ధులు, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వర్షాలతో గాలి లో తేమ పెరిగే అవకాశం ఉన్నందున బయటి వాతావరణంలో తిరగకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉన్ని దుస్తులు ధరించి చలి నుంచి రక్షణ పొందాలని, ఆహారం వేడిగా ఉన్నప్పుడే భుజించాలని వారు సూచిస్తున్నారు.
చలి పెరుగడంతో శీతాకాలం దుస్తులకు గిరాకీ పెరిగింది. రోడ్డు పక్కల ఉన్ని దుస్తుల షాపులు కోకొల్లలుగా వెలిశాయి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి మరీ వ్యాపారాన్ని నడుపుతున్నారు. అన్ని వయస్కుల వారికి అనుగుణంగా స్వెటర్లు, జర్కిన్లు, మంకీటోపీలు అందుబాటులో ఉన్నాయి. దుకాణాల్లో కన్నా తక్కువ ధరకు లభిస్తుండడంతో వినియోగదారులు ఎక్కువగా ఫుట్పాత్ వెంట అమ్ముతున్న వస్ర్తాలనే కొంటున్నారు. చలి ఎక్కువగా ఉండడంతో ఈసారి ఉన్ని దుస్తుల వ్యా పారం బాగా ఉన్నదని వ్యాపారులు పేర్కొంటున్నారు.